లాక్ డౌన్ నేపథ్యంలో నిరుపేదలను అదుకునేందుకు దాతలు ముందుకు రావాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఐకేఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ద్య కార్మికులకు నిత్యవసర సరుకుల పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ నిరుపేదలు, వలస కార్మికులు, పారిశుద్ద్య సిబ్బందిని అదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. కష్ట కాలంలో పేదలను దాతలు అదుకోవాలని కోరారు. ఐకేఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ కన్వీనర్ అల్లోల గౌతంరెడ్డి, దివ్యారెడ్డి వేయి మంది పారిశుద్ద్య కార్మికులకు బియ్యంతో పాటు ఇతర నిత్యావసర వస్తువులను అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు.
విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు తమ వంతు సహాయంగా నిత్యావసర సరుకులను అందజేసినట్లు అల్లోల గౌతంరెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ శశిధర్ రాజు, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, వైస్ చైర్మన్ సాజిద్, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, ఎఫ్ఎస్ సీయస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, టీఆర్ఎస్ నాయకులు మారుగొండ రాము, రాంకిషన్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.