గుంటూరు జిల్లా మంగళగిరిలో మద్యం దుకాణాన్ని తెదేపా అనుబంధ విభాగం ‘తెలుగు మహిళ’ ఆధ్వర్యంలో ముట్టడించారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సీఎం జగన్ తన పాదయాత్ర సమయంలో ఇచ్చిన దశలవారీ మద్య నిషేధం హామీ అమలు ఎక్కడని మహిళలు ప్రశ్నించారు. మద్య నిషేధం హామీని విస్మరించడమే కాకుండా దాన్ని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ నాసిరకం బ్రాండ్లన్నీ ఏపీలోనే దొరుకుతున్నాయని, పుట్టినరోజు నాడైనా మద్య నిషేధం హామీని జగన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ సంపాదన కోసమే మద్యం దుకాణాల వద్ద ఆన్లైన్ పేమెంట్లు పెట్టలేదన్నారు. సీజన్ దృష్ట్యా తాత్కాలికంగా మద్యం ధరలు తగ్గించారని ఆమె విమర్శించారు.