పల్నాడు జిల్లా కలెక్టరేట్ లో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమానికి జిల్లాలోని ఎంతో మంది ఆశతో వస్తున్నారని కానీ సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఆయా సమస్యల పట్ల ఎటువంటి పరిష్కారం చేయనప్పటికీ సమస్యను పరిష్కరించినట్లు అధికారులు చరవాణికి సందేశం పంపుతున్నారని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డా॥గోదా రమేష్ కుమార్ అన్నారు.
ఈరోజు స్థానిక రొంపిచర్ల మండలం నల్లగార్లపాడులోని అంబేద్కర్ నగర్ లో జరిగిన సమావేశంలో రమేష్ కుమార్ మాట్లాడుతూ నల్లగార్లపాడు లోని అంబేద్కర్ నగర్ వాసులతో కలసి రావిపాడు కాలువ వద్ద నుండి నల్లగార్లపాడు గ్రామం వరకు వెళ్ళే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయమైందని దీని వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారని స్కూల్,కాలేజ్ లకు వెళ్ళే విద్యార్థినీ విద్యార్థులు మరియు పలు ప్రదేశాలకు వెళ్ళే ప్రయాణికులు యాక్సిడెంట్లకు గురయ్యారని ఆయా ప్రమాద ఘటనలలో గతంలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
కాంట్రాక్టర్లు 68లక్షల 26వేలకు టెండర్ వేసి పనులు ప్రారంభించడం లేదని కనీసం కాలినడకన కూడా ఈరోడ్ లో నడవలేని పరిస్థితి నెలకొందని తక్షణమే సమస్య పరిష్కరించాలని గత నెల 18వ తేదీన స్పందన కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి కి కలసి సమస్య వివరించి అర్జీ అందజేశామని వెంటనే కలెక్టర్ సంబంధిత ఇఇ ని పిలిపించి రోడ్డు మరమ్మత్తుల సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పినా సంబంధిత అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారని అన్నారు.
సమస్య పరిష్కరించకపోగా మీ సమస్యను పరిష్కరించామని చరవాణికి సందేశం పంపడం ఎంతవరకు సబబు అని ప్రజలు తమ సమస్యల పరిష్కారం కొరకు స్పందనకు వస్తూఉంటే అధికారులు కనీసం సమస్యపట్ల స్పందన లేకుండా సమస్య పరిష్కరించినట్లు సందేశం ఎలా పంపుతారని తమ సమస్యపై తక్షణమే పల్నాడు జిల్లా కలెక్టర్ స్పందించి సమస్యను పరిష్కరింపజేసి సమస్యపట్ల నిర్లక్ష్యం వహించిన సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని లేని పక్షంలో నల్లగార్లపాడు గ్రామస్తులతో కలసి కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని తెలిపారు.