ఈ ఫొటోలో కనిపించే వ్యక్తి ఒక కార్పొరేట్ కాలేజీ బాధ్యుడు. డిజిగ్నేషన్ ఏమైనా ఆయన మాట్లాడే మాటలు మాత్రం విద్యార్ధుల్ని, వారి తల్లిదండ్రుల్ని తీవ్ర మానసిక వేదనకు గురి చేసే విధంగా ఉన్నాయి. చాలా కాలేజీలు కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ క్లాసులు మొదలు పెట్టాయి.
కరోనా పరిస్థితి ఉన్నా కూడా ఆన్ లైన్ లోనే ఫీజులు వసూలు చేసి, ఆన్ లైన్ లోనే క్లాసులు మొదలు పెట్టారు. ఇప్పుడు ఫీజు చెల్లిస్తేనే రెన్యువల్ చేస్తామని ఆయన విద్యార్ధులకు చెబుతున్నారు. నేటి మధ్యాహ్నం లోపు ఎనిమిది వేలో పది వేలో కట్టేయాలని, ఈ సమయం దాటితే 20 వేలు కడితేనే రెన్యూ చేస్తామని ఆయన సుతిమెత్తగా చెబుతున్నారు. సాధారణంగా అయితే దీని సంబంధించిన మెసేజిలు తల్లిదండ్రులకు పెట్టాలి.
ఫీజు కట్టని వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి కౌన్సిలర్లు మాట్లాడాలి. అంత వరకూ ఫర్వాలేదు. కరోనా సమయంలో నిర్దాక్షిణ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారనే దారుణాన్ని పక్కన పెట్టినా ఈ విధంగా చేస్తే కొంత వరకూ ఉపశమనం ఉంటుంది. తల్లిదండ్రులకు ఆదాయం లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ విధంగా ఆన్ లైన్ క్లాస్ మధ్యలోకి వచ్చి ఇలా పిల్లలను నేరుగా బెదిరించడం ఏ చట్టం ప్రకారం కరెక్టో ఆ కార్పొరేట్ కాలేజీలే చెప్పాలి. ఫీజు కట్టలేకపోయిన విద్యార్ధుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో వారు తమ తల్లిదండ్రులపై ఏ విధంగా వ్యతిరేక భావనలు పెంచుకుంటారో అనే విషయాలను కూడా పట్టించుకోకుండా ఇంత దారుణంగా ఈ కార్పొరేట్ కాలేజీలు పని చేస్తున్నాయి.