ఆప్రకటిత కరెంటు చార్జీల పెంపుతో వైసీపీ ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తున్నదని గుంటూరు జిల్లా నరసరావుపేట టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. నమ్మి గెలిపిస్తే ప్రజలను నట్టేట ముంచారని ఆయన గురువారంనాడు ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండు నెలలకు ఒకసారి బిల్లు ఇవ్వడంతో స్లాబులు మారిపోతున్నాయని, 4, 5 రేట్లు పెంచి దొంగ లెక్కలతో ప్రభుత్వం ప్రజల్ని దోచుకోవటం దుర్మార్గమన్నారు. మధ్య తరగతి వర్గాలు కరెంట్ బిల్లు పట్టుకుంటే షాక్ కొడుతుందని అన్నారు. లాక్ డౌన్ సమయంలోని కరెంటు బిల్లును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని డాక్టర్ చదలవాడ అన్నారు.
ఐదేళ్ల చంద్రబాబు పాలనలో విద్యుత్ చార్జీలు పెంచలేదని అరవింద బాబు గుర్తు చేశారు. జగన్ వచ్చిన తర్వాత ఊరు పేరు లేని మద్యం బ్రాండ్లతో వేల కోట్లు జె టాక్స్ పనులు చేస్తున్నారన్నారు. నిత్యావసర వస్తువులతో పాటు విద్యుత్ ధరలు పెరిగాయని పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ప్రభుత్వం మెడలు వంచైన సరే రెండు నెలల కరెంట్ బిల్లులు రద్దు చేస్తామని అన్నారు. ప్రజలకు ఇంటి అద్దె అడిగితే కేసులు పెట్టండి అని చెప్పిన ప్రభుత్వం విద్యుత్ బిల్లు కోసం ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదని అరవింద బాబు హెచ్చరించారు.