తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన ఆలోచన నుండి పురుడు పోసుకున్న నూతన రెవెన్యూ చట్టం గ్రామాల్లో రైతుల ముసుగు వేసుకొని సంచరిస్తూ పట్టాదారుని బెదిరిస్తున్న మాఫియాకి ఉరితాడు లాంటిదని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కు చెందిన 90 సంవత్సరాల వృద్ధురాలు అమరవాది లక్ష్మీ నరసమ్మ అన్నారు.
నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ గురువారం హుజూర్ నగర్ టీచర్స్ కాలనీ లోని తన స్వగృహంలో కుమారులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం చిత్రపటం పై అక్షింతలు వేసి నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆ వృద్ధురాలు ఆశీర్వదించింది.
భూ మాఫియా ఆగడాలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడం కోసం ఇటీవల జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి రాష్ట్ర చరిత్రలో నిలిచారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసమ్మ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నిరుపేదలు, అసహాయుల మనసు ఎరిగి పరిపాలన సాగించటం కేసీఆర్ కే సాధ్యం అయింది అన్నారు.
నూటికో కోటికో యుగపురుషుడు అవతరిస్తారని పురాణాలు చెబుతున్నాయి అట్టి యుగపురుషుడు తెలంగాణ ముద్దుబిడ్డ కేసీఆర్ అని ఆమె కొనియాడారు.
ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ భూ వివాదాలు సృష్టిస్తూ బడుగు బలహీన వర్గాలను ఇబ్బందులకు గురి చేస్తూ వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న భూ మాఫియా దారులపై పీడీ యాక్ట్ అలాంటి కఠినమైన చట్టాలు అమలు చేయాలని, వారిపట్ల ఈ నూతన రెవెన్యూ చట్టం ఉరితాడు కావాలని ఆమె అన్నారు.