33.7 C
Hyderabad
April 29, 2024 23: 31 PM
Slider సంపాదకీయం

ఇంట్రోస్పెక్షన్: పౌరసత్వంపై ఇక చాలు తగ్గండి

CAA protest

కాంగ్రెస్ ముక్త్ భారత్ ఎంత వరకు వచ్చింది? దేశం నుంచి కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని పిలుపునిచ్చిన బిజెపి పెద్దలు ఇప్పుడు ఆ మాట వాడటం లేదు. అంటే కాంగ్రెస్ ముక్త భారత్ వచ్చేసిందని అర్ధమా? లేక అంతకన్నా పెద్ద సమస్యలు వచ్చిపడ్డట్టు అనుకోవాలా? దేశ ప్రజలను మెప్పించే పనులు చేస్తే ఆటోమేటిక్ గా ఒక్క కాంగ్రెస్ పార్టీనే కాదు.

దేశంలోని అన్ని పార్టీలూ కనుమరుగైపోతాయి. దేశంలో కమలనాథులు తప్ప వేరే నాథుడు ఉండడు. అలా చేయకుండా కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలి అంటే కుదరుతుందా? కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతే మరో శక్తి ఆ స్థానంలోకి వస్తుంది కానీ ఆ స్థానం ఖాళీగా ఉండదు.

ఇది సింపుల్ లాజిక్కు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న రోజుల్లో ఆ పార్టీ చేసిన తప్పుల వల్లే బిజెపి అధికారంలోకి రాగలిగింది. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులను రిపీట్ చేయకుండా ఉన్నట్లయితే దేశంలో ఇప్పటికే కాంగ్రెస్ ముక్త భారత్ ఏర్పడి ఉండేది. అయితే బిజెపి అలా చేయలేదు. గత ఆరు సంవత్సరాల కాలంలో 70 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ తప్పులన్నింటిని బిజెపి చేసేసింది.

ఒక్క ఎమర్జెన్సీ విధించడం తప్ప. ఆ పని కూడా బిజెపి చేస్తుందేమోననే భయంతోనే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు కొందరు మాత్రమే పని గట్టుకుని చేస్తున్నారని చెప్పవచ్చు. వాటిని అణచి వేయాలని కూడా చూడవచ్చు. అణచివేయవచ్చు కూడా.

అయితే ఎక్కడో ఒక గొంతుక అయినా ప్రశ్నిస్తూనే ఉంటుంది. 370 ఆర్టికల్ ను రద్దు చేసినప్పుడు కాశ్మీర్ లో అశాంతి చెలరేగింది కానీ దేశం మొత్తం సంతోషించింది. అప్పటిలో ఎన్నికలు నిర్వహిస్తే ప్రధాని మోడీకి 350 సీట్లు వచ్చేవని మోడీతో విభేదించే సీనియర్ నాయకుడు యశ్వంత్ సిన్హా లాంటి వారు కూడా చెప్పారు.

ఆర్టికల్ 370 రద్దుకు అంతటి సపోర్టు వచ్చింది. ముస్లిం మహిళలకు సంబంధించి త్రిపుల్ తలాఖ్ పై కూడా ఎవరూ ఏం మాట్లాడలేకపోయారు. ముస్లిం మహిళలతో బిజెపి ర్యాలీలు నిర్వహించింది. అది కూడా మంచి నిర్ణయంగానే మెజారిటీ ప్రజలు చెప్పుకున్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు అన్ని అడ్డంకులు తొలగించింది.

చిన్న చిన్న వివాదాలు ఉన్నా అవి పెద్ద ప్రతిబంధకాలు కావు. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం ఈ రెండూ కాకుండా ఇక నరేంద్రమోడీకి, అమిత్ షా కు కావాల్సింది ఏముంటుంది? నిజమైన ఆర్ఎస్ ఎస్ వాదులు, హిందూత్వ వాదులు అందరూ కూడా ఈ రెండు నిర్ణయాలతో ఎంతో సంతృప్తితో ఉన్న దశలో బిజెపి తన హద్దులు తెలుసుకుని ప్రవర్తించి ఉంటే దేశంలో ఈ కల్లోలం ఉండేది కాదు.

ఆర్టికల్ 370 రద్దు, రామ మందిర నిర్మాణం జీవిత కాలంలో జరిగేవి కాదని చాలా మంది హిందూత్వ వాదులు నిరాశతో ఉన్న సమయంలో మోడీ అమిత్ షాలు  చేసి చూపించారు. అంతటితో ఆగి ఉంటే సరిపోయేది కానీ పౌరసత్వ చట్టం తీసుకురావడం, ఎన్ ఆర్ సి, ఎన్ పి ఏలపై మొండిగా ముందుకు వెళ్లడం బిజెపి కి అసలుకే ఎసరు వచ్చే పరిస్థితి తెచ్చింది.

సిఏఏ, ఎన్ ఆర్ సి, ఎన్ పి ఏ ల వల్ల దేశంలో నివసిస్తున్న వారికి ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదు. రాదు కూడా. అయితే ఆ విషయాన్ని ముస్లింలు నమ్మడం లేదు. ఆర్టికల్ 370 రద్దు చేస్తే కాంగ్రెస్ లెక్కల ప్రకారం అంతర్యుద్ధం రావాలి. రాలేదు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపడితే ముస్లింలు తిరుగుబాటు చేయాలి. చేయలేదు. ఇంతటితో బిజెపి ఆగాలి కదా? ఆగలేదు.

అందుకే ముస్లింలు ఇంత బాహాటంగా రోడ్లపైకి వస్తున్నారు. రాష్ట్రాలు ప్రతిఘటిస్తున్నాయి. ఆఖరికి హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కూడా వీటికి వ్యతిరేకంగా తీర్మానం చేసింది. రాజకీయ లబ్ది కోసం ఇలా చేస్తున్నారని బిజెపి నాయకులు అంటున్నారు. నిజమే కావచ్చు. మీరు సిఏఏ, ఎన్ఆర్ సి, ఎన్ సి పి తెచ్చింది రాజకీయం కోసం కాదా? ఆలోచించండి. ఈ విషయంలో తగ్గితే మీకు ఎలాంటి అపకారం జరగదు. మీరు సాధించిన విజయాలు మీకు మంచి పేరునే మిగులుస్తాయి.

Related posts

టిఆర్ఎస్ ని ఎదుర్కొనే దమ్ము ఒక్క బీజేపీ కి మాత్రమే వుంది

Satyam NEWS

పసికందును ఇంట్లో వదిలి.. రైతుల కోసం విధులకు

Satyam NEWS

శాస్త్రీయ విద్యా విధానం కావాలి

Bhavani

Leave a Comment