ఇది రక్షక భటుల కార్యాలయం కాదు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం అని డాక్టర్ వంశీకృష్ణ ఆరోపించారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల గ్రామంలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగాలలో ఉన్నది రక్షక బటుల కార్యాలయం కాదని, బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం అని అందులోని పోలీస్ అధికారులు బిఆర్ఎస్ కార్యకర్తల వలే పనిచేస్తున్నారని వంశీకృష్ణ దుయ్యబట్టారు.
అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేస్తే ఫిర్యాదుదారులపై తప్పుడు కేసులు మోపుతున్నారని ఇది రజాకర్ల రాజ్యము కంటే ఘోరంగా ఉందని ఆరోపించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ అవినీతి అరాచకాలపై జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ దృష్టికి తీసుకు వెళుతూ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ని కలవనున్నట్లు ఆయన తెలిపారు.
కాంగ్రెస్ కార్యకర్తను లింగాల గ్రామ సర్పంచ్ చెప్పుతో కొట్టడం తప్పని, లింగాల సర్పంచ్ కోనేటి తిరుపతయ్య ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఆయనను కస్టడీలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో అచ్చంపేట స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రాజకీయ గుండాల వలే దాడులు చేస్తున్నారని, అన్యాయాలు అక్రమాలు శాశ్వతం కాదని, వారు చేసే అవినీతి అక్రమాలు ప్రజలు చూస్తున్నారని వారికి భవిష్యత్తులో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
మంగళవారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు శివ స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినారు. అన్నదాన కార్యక్రమాన్ని రాజకీయం చేసి కాంగ్రెస్ కార్యా కర్తలపై దౌర్జన్యానికి దిగిన పోలీసులు చోద్యం చూస్తున్నారని ఫిర్యాదుదారులపైనే అక్రమ కేసులు బనాయిస్తూ అక్రమంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ కోనేటి తిరుపతయ్యను కేసు నమోదు చేసి విచారణ జరిపించి కస్టడీలోకి తీసుకోవాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమంతో పాటు, స్థానిక పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తామని ఆయన పోలీసులను హెచ్చరించారు.
రానున్న రోజుల్లో అధికారంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని కార్యకర్తలకు ప్రజలకు అండగా నిలిచేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు బి ఆర్ఎస్ పార్టీ గుండాలకు భయపడకూడదని అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం ర్యాలీగా పోలీస్ స్టేషన్ వెళ్లి సర్పంచ్ పై ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగమ్మ వైస్ ఎంపీపీ నారాయణ గౌడ్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస రాథోడ్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.