తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పోలీసుల్ని, అధికారుల్ని బెదిరించడం శోచనీయమని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. చివరికి ప్రజల్ని కూడా ఆయన బెదిరించారని, చంద్రబాబు మాట్లాడినది ఆవేశంతో కాదు… అక్కసుతో అని వారన్నారు. శనివారం నాడు పెనుకొండ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబును గో బ్యాక్ అన్నందుకు కోపం వచ్చిందట, అందుకు ఆయన దూషణల పర్వానికి తెరతీశారని వారు తెలిపారు.
చంద్రబాబు వల్ల అన్యాయానికి గురైన ప్రాంతానికి చెందిన ప్రజలకు కోపం రావడం వల్లే గోబ్యాక్ నినాదాలు చేశారని వారన్నారు. పట్టాభి నుంచి పవన్ కల్యాణ్ వరకు అందరికీ ఏం తిట్టాలో చంద్రబాబే చెబుతున్నారని, నిరాశ, చేతగాని తనం నుంచి ఇవన్నీ వస్తున్నాయని వారు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఒక విస్తృతమైన ఆలోచనతో, ముందు చూపుతో, ప్రతి నియోజకవర్గంలోనూ నేలమీద నడిచిన మనిషిగా… ప్రజల మనిషిగా ఒక నిర్ణయం తీసుకున్నారని వారు తెలిపారు.
దానికి ప్రజల మద్దతు ఉందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పెనుకొండ జడ్పీటీసీ శ్రీరాములు, నగర పంచాయతీ ఛైర్మన్ పి.ఉమర్ ఫరూక్ ఖాన్, వైస్ చైర్మన్ బోయ సునీల్, మండల కన్వీనర్ నాగళూరు బాబు, పట్టణ కన్వీనర్ నరసింహ, మాజీ మండల కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.