రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను అవమానించేలా అంబేద్కరిజాన్ని నశింపజేసేలా వైస్సార్ సీపీ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డా॥గోదా రమేష్ కుమార్ అన్నారు.
నేడు పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం నల్లగార్లపాడులోని అంబేద్కర్ నగర్ లో జరిగిన సమావేశంలో రమేష్ కుమార్ మాట్లాడుతూ కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును వ్యతిరేకించి ఆందోళన చేపట్టిన ఆందోళనకారులకు వెన్నుదన్నుగా ఉన్న నేతలను అధికారులు ఎందుకు బహిర్గతం చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
బాపట్లజిల్లాలో అంబేద్కర్ చిత్రపటాన్ని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు విద్యార్థులచేత తగలపెట్టించిన ఘటనలో ఆ ఉపాధ్యాయుని విధులనుండి ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. రావులపాలెం మండలం గోపాలపురంలో అంబేద్కర్ బొమ్మను పేపర్ ప్లేట్లపై ముద్రించిన వారిని ఇదేమిటని ప్రశ్నించిన అంబేద్కర్ వాదులపై అక్రమ కేసులు పెట్టించి వారిని జైలుకు పంపి వైస్సార్ సీపీ ప్లీనరీ సమావేశాలలో దళిత బహుజనుల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎలా చెప్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
దళిత బహుజనులకు తీరని అన్యాయం చేస్తున్న ప్రభుత్వంలో ఉన్న మంత్రులు,ఎమ్మెల్యేలు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత టీడీపీ ప్రభుత్వం ప్రస్తుత వైస్సార్ ప్రభుత్వం తమ ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే అంబేద్కర్ 125అడుగుల విగ్రహం నిర్మిస్తున్నామని ప్రచారాలు చేసుకొని తీరా గెలిచాక అంబేద్కను అవమానపరుస్తున్నారన్నారు.
అంబేద్కర్ ఓవర్సీస్ పథకాన్ని మరియు ఎస్సీల 17రకాల పథకాలను రద్దుచేసి దళితుల జీవితాలను చీకటి మయం చేసిన జగన్ ప్రభుత్వానికి ప్రజలు ఓటు బ్యాంకు ద్వారా తగిన బుద్దిచెప్పడం ఖాయమని తెలిపారు. ఈ సమావేశంలో డీబీహెచ్ పీయస్ రాష్ట్ర కమిటీ సభ్యులు గోదా వెంకట రమణ, మహేష్, శ్రీనివాసరావు, విజయేంద్ర, నాగేశ్వరావు, ప్రభాకరరావు, మరియదాసు, నాగేంద్ర ప్రసాద్,కొప్పుల వసంతబాబు తదితరులు పాల్గొన్నారు.