జగనే ఎందుకు కావాలని ప్రశ్నించిన వ్యక్తిని వైకాపా నేతలు చితకబాది జైల్లో పెట్టిన వైనం
దొంగ ఓట్లపైనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆధారపడి ఉందని, ప్రజలు తమకు ఓట్లు వేస్తారనే నమ్మకం మా పార్టీ నాయకత్వానికి లేదని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామ కృష్ణంరాజు తెలిపారు . బస్సు యాత్ర కాస్తా, తుస్సు యాత్ర గా మారిందని అర్థమయింది. సాక్షి దినపత్రిక చదివిన వారికి మాత్రం, బస్సు యాత్రకు విపరీతంగా జనం వస్తున్నట్లుగా గ్రాఫిక్స్ ఫోటోల ద్వారా భ్రమ కల్పిస్తున్నారన్నారు.బస్సు యాత్రలో ఖాళీగా కూర్చుని దర్శనమిస్తున్నాయి.
జనం ఎక్కడ కూడా కనిపించడం లేదన్నారు. గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… దొంగ ఓట్ల నమోదుపై రాజీ పడేదే లేదన్నట్లుగా వైకాపా నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయంపై సిటిజన్స్ ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు న్యాయస్థానంలో కేసు వేశారు. అయినా తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తుండడం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి నియోజకవర్గంలోను ఒక్కొక్కరి పేరిట రెండు నుంచి నాలుగు వరకు దొంగ ఓట్లను నమోదు చేశారు.
ఇలా నమోదు చేసినవే ప్రతి నియోజకవర్గంలోనూ 50 వేల పైచిలుకు ఓట్లు ఉంటాయని తేలింది. ఒక్కొక్కరి పేరిట కొన్నిచోట్ల 10 దొంగ ఓట్లు కూడా ఉన్నాయంటున్నారు. కొద్ది పేరు మార్పు ద్వారా ఇలా దొంగ ఓట్లను నమోదు చేశారన్నారు. దొంగ ఓట్ల ద్వారానే , రానున్న ఎన్నికల్లో విజయం సాధించవచ్చునని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇలా దొంగ ఓట్లన్నీ వైకాపా కార్యకర్తలు, నాయకుల పేర్లే ఉండడం గమనార్హం. ఒకే డోర్ నెంబర్ పై వేలకు, వేల ఓట్లు ఉండడంపై ఇప్పటికే వ్యక్తిగతంగా నేను, ప్రతిపక్ష పార్టీలుగా తెలుగుదేశం, జనసేన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి.
సీనియర్ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కు మూడేళ్లుగా ఓటు హక్కు కల్పించడం లేదు. ఇదే విషయమై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఈ విషయంలో ఖచ్చితమైన హెచ్చరికను చేస్తుందని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు ఉన్నదా?, లేదా అని సరిచూసుకోవాలి. ఓటు హక్కును సరి చూసుకోవడం ద్వారా మన రాష్ట్రాన్ని మనమే పరిరక్షించుకోవాలి. అలాగే, పోలింగ్ రోజు మన ఓటు వాలంటీరో, వైకాపా పెయిడ్ కార్యకర్త దొంగ ఓటు వేయకుండా జాగ్రత్తపడాలి.
రాష్ట్రంలో దొంగ ఓట్ల నమోదుపై కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యక్తిగతంగా నేను, నాతోపాటు ఇతర పక్షాల నాయకులు వినతి పత్రాలను అందజేయడం జరుగుతుంది. ఓటరు జాబితాలో మీ ఓటును మీరు సరి చూసుకోకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. ఇదే విషయాన్ని బిజెపి, టిడిపి, జనసేన పార్టీలను కార్యకర్తలు నాయకులు అవసరమైతే కొద్ది రోజులపాటు ప్రతి గ్రామంలో హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. అక్కడకు వచ్చి ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును సరి చూసుకునేలా ప్రజలను జాగృతపరచాలి . ఓటర్ జాబితాలో పేరు లేని వారి పేరిట దరఖాస్తు ఫారం నింపి, వారి ఓటు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణం రాజు కోరారు.
ఫ్లెక్సీ చింపినందుకు దళిత యువకుడిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన పోలీసులు
బస్సు యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఒక వ్యక్తి ఫొటో నచ్చక అతని ఫోటోను దళిత యువకుడు ఒకరు చింపివేస్తే, అతనిపై పోలీసులు చేసిన దురాగతంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఆ దళిత యువకుడు చింపింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో కాదు. ఫ్లెక్సీలో చివరన ఉన్న ఒక వ్యక్తి ఫోటో మాత్రమే. దానికి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ పై చేయి వేస్తావా అంటూ సదరు దళిత యువకుడిని పోలీసులు వేధించారు. పోలీసుల వేధింపులకు భరించలేక ఆ యువకుడు మనో వ్యధ తో ఆత్మహత్య చేసుకున్నాడు.
గతంలో నా పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో వేలాదిగా ఏర్పాటు చేసిన నా ఫ్లెక్సీలను, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారితోనే బలవంతంగా పోలీసులు తీసి వేయించారు. మరి నా ఫ్లెక్సీలను తీసి వేయించే అధికారం పోలీసులకు ఎవరు ఇచ్చారు.. జగనన్న ఫ్లెక్సీ పై వేలు పెట్టినందుకే దళిత యువకుడు ఆత్మహత్య చేసుకునేలా పోలీసులు ప్రేరేపించారు. ఈ దురాగతాలను చూస్తూ జనాలు ఊరుకుంటారని అనుకుంటున్నారా?, ప్రస్తుతానికి ఊరుకున్నప్పటికీ, సరైన సమయంలో తగిన శాస్తి చేస్తారని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు.