జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యల విషయంలో పవన్ కల్యాణ్ ను విచారించేందుకు అనుమతి ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తల ఆధారంగా పవన్ కల్యాణ్పై కేసుల నమోదుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్పై కేసులు పెట్టి, ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతులిచ్చింది.
వ్యక్తిగత హోదాలో పవన్ కల్యాణ్పై సంబంధిత కోర్టుల్లో పరువు నష్టం కేసులు దాఖలు చేయాల్సిందిగా సూచిస్తూ గురువారం గ్రామ వార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల కారణంగా వాలంటీర్ వ్యవస్థ ప్రతిష్టకు తీవ్రంగా భంగం కలిగిందని పేర్కొన్నారు. క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ 199/4 ప్రకారం కేసులు నమోదు చేసి, ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వులో వివరించారు.
జులై 9వ తేదీన ఏలూరు నగరంలో నిర్వహించిన వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఈ ఉత్తర్వులు ఇస్తున్నట్లు పవన్ పై పరువు నష్టం కేసులు దాఖలు చేయాల్సిందిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు సూచనలు జారీ చేస్తున్నట్లు ఉత్తర్వులలో వివరించారు. వారాహి విజయ యాత్ర పేరుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే.
పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్.. వివిధ వర్గాల ప్రజలు, యువత, రైతులు, వీర మహిళలతో సమావేశమై, వారి సమస్యలను తెలుసుకుని వినతులను స్వీకరిస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో జులై 9వ తేదీన ఏలూరు నగరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ”ఆంధ్రప్రదేశ్లో 29 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారు. వీరిలో కొంత మంది మాత్రమే ట్రేస్ అయ్యారు.
మిగతా వారు ఏమయ్యారో తెలియదు. వాలంటీర్లు సేకరించిన సమాచారం సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్తోంది” అంటూ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై వాలంటీర్లు రాష్ట్ర మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీంతో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు, వివరణ ఇవ్వాలంటూ మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది.
జైలుకు వెళ్లేందుకైనా సిద్ధం పవన్
జనసేనాని మూడు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి ఎన్డీయే సమావేశంలో పాల్గొన్నారు. ఆ మరుసటి రోజు (మంగళవారం) కేంద్ర హోంమంత్రి అమిత్షాతో సమావేశమైన ఆయన రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు ట్వీట్ చేశారు. ఆ తర్వాత దిల్లీ పర్యటన ముగించుకుని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో వాలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కేసులు పెట్టి ప్రాసిక్యూట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యక్తిగత హోదాలో పవన్పై సంబంధిత కోర్టుల్లో పరువు నష్టం కేసులు దాఖలు చేయాల్సిందిగా గ్రామ వార్డు వాలంటీర్లకు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ 199/4 ప్రకారం కేసులు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.