అమరావతిలో ఏదో జరిగిందని నిందలు వేసి మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసేందుకే ప్రభుత్వం సిట్ కమిటీ విచారణ చేపట్టిందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆరోపించారు. ఎన్నికల నాటికి పది రోజులైనా జైలుకు పంపి చంద్రబాబు కూడా జైలులో ఉన్నారంటూ ప్రజల్లో ప్రచారం చేయాలన్నదే ముఖ్యమంత్రి పంతం, ప్రతీకారం అంటూ ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రజావేదికను కూల్చివేయగానే, రెండవ కార్యక్రమంగా చంద్రబాబు అరెస్టు జరగాల్సి ఉందని పేర్కొన్నారు.
చంద్రబాబును ఎలా అరెస్ట్ చేయాలన్న ప్రణాళికలు పదే పదే రచించారని చెప్పారు. కృష్ణా నది ఒడ్డున అక్రమ కట్టడాలు కట్టారని, అన్నింటినీ కూల్చేస్తామని, అనుమతి ఇచ్చిన చంద్రబాబు పై చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటించినట్లు గుర్తు చేశారు. న్యాయస్థానాల చొరవతో అవి సాధ్యం కాకపోవడంతో, క్యాబినెట్ ఆమోదంతో రాజధాని భూముల్లో అక్రమాలు జరిగాయి అంటూ సిటి విచారణ వేసినట్లు చెప్పారు. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఒకటి అమరావతి పై నింద, రెండు చంద్రబాబు అరెస్టు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. సిట్ విచారణ పై హైకోర్టు స్టే విధించటంతో అరెస్టు పర్వం వాయిదా పడిందని, తాజాగా సుప్రీం కోర్టు స్టే ఎత్తి వేయటంతో మళ్ళీ అరెస్టు కు రెడీ అవుతున్నారని తెలిపారు.
ఒక్కరోజు కూడా సిట్ విచారణ చేపట్టకుండానే ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి జోగి రమేష్ చంద్రబాబును అరెస్టు చేస్తామంటూ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం అన్నారు. తెలుగు దేశం పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు కాలు తీసి కాలు పెడితే ఆంక్షలు విధిస్తున్నారని, రాజమండ్రి జైల్లో ఉన్న ఇద్దరు టిడిపి నాయకులను పరామర్శిస్తే, అందుకు అనుమతి ఇచ్చిన జైలర్ ను బదిలీ చేశారని, తడిసిన ధాన్యాన్ని చూసేందుకు వెళ్తున్నా, బారికేడ్లను పెడుతున్నారని, కాన్వాయ్ ని అడ్డుకునేందుకు ఆటంకాలు పెడుతున్నారని పేర్కొన్నారు.
మానసికంగా వేధించి ఆనందం పొందుతున్నారని తెలిపారు. న్యాయస్థానాలను కూడా మేనేజ్ చేసుకోవచ్చు అని సాక్షాత్తు ముఖ్యమంత్రే పలు మార్లు చెప్పారని, గతంలో చంద్రబాబు కోర్టులను లోబరుచుకున్నట్లు ఆరోపణలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి అదే త్రోవలో వందల కోట్లు ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టి అనుకూలమైన తీర్పులను, ఉత్తర్వులను పొందుతున్నట్లు ఆరోపించారు.
జీవో నెంబర్ వన్ క్వారన్ టైన్ లో ఉండటానికి, జూన్ 11వ తేదీన జరగాల్సిన అమరావతి రాజధాని కేసు మే 9 తేదీన విచారణకు రావడానికి, పదే పదే రాజధాని హై కోర్టు తీర్పుపై స్టే అడగటానికి, వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్టు కు కోర్టుల్లో కాలు అడ్డు పెట్టటాన్ని ఏ మంటారు? అని ప్రశ్నించారు. వీటిపై ప్రజల్లో విసృతంగా చర్చ జరుగుతోంది అన్నారు. ఇప్పటికే ఎపీలో ఐఎఎస్, ఐపిఎస్ వ్యవస్థలపై ప్రజల్లో విశ్వాసం పోయిందని, కోర్టులపై కూడా విశ్వాసం పలుచబడిందని తెలిపారు. ఇలాంటి ప్రక్రియ ప్రజాస్వామ్య వ్యవస్థ కు చేటు తెస్తుందని, చట్టం, న్యాయం అందరికీ సమానమే అన్న మాట నేతి బీర న్యాయం గా మారుతోందని బాలకోటయ్య అభిప్రాయపడ్డారు.