మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించబోతోందని మెజార్టీ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలను టీడీపీ కైవసం చేసుకుంటందని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అన్న క్యాంటీన్లు, యువత ఉపాధి, పన్నుల తగ్గింపు, టిడ్కో ఇళ్లు, ఉచిత మంచినీరు, పారిశుద్య కార్మికుల జీతాల పెంపు, ఆటో స్టాండ్ లక్ష్యాలతో ఎన్నికల బరిలో దిగిన టీడీపీకి భారీ మద్దతు లభిస్తోందని ఆయన మంగళవారం తెలిపారు.
ఈ ఎన్నికల్లో వైసీపీని ఓడించి ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి ప్రజలు బుద్దిచెప్పాలని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి రూ. 5 కే మూడు పూటలా పేదలు, మద్య తరగతి ప్రజలకు ఆకలి తీర్చారు.
రోజుకు 6 లక్షలమందికి పైగా ఈ అన్న క్యాంటీన్లలో గౌరవప్రదంగా తమ ఆకలి తీర్చుకున్నారు. అయితే జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లు మూసివేసి పేదల నోటికాడ కూడు కొట్టేశారు. మరో వైపు నిత్యవసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి పన్నులమీద పన్నులు విధిస్తూ పేదల నడ్డి విరుస్తోంది. ఒక్క ఆస్తి పన్ను ద్వారానే పట్టణాలు, నగరాలలోని ప్రజలపై ఏడాదికి రూ. 8 వేల కోట్ల భారం మోపనున్నారు.
టీడీపీ ప్రభుత్వంలో రూ. 5,500 కోట్లతో పట్టణ ప్రజల కోసం మంచినీటి సదుపాయం కల్పించాం. కానీ జగన్ ప్రభుత్వం ప్రజలకు మంచినీటి సరపరాపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేసింది.
ప్రతి ఏడాది జనవరి 1 న ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రగల్బాలు పలికిన జగన్ అధికారంలోకి వచ్చాక యువతను నిలువునా మోసం చేశారు. అందుకే 6 నెలలకొకసారి యువతకు ఉపాధి కల్పించేందుకు టీడీపీ జాబ్ మేళాలు నిర్వహించాలని నిర్ణయించింది.
6 లక్షల మంది యువతకు చంద్రబాబు నాయుడు నిరుద్యోగ భృతి కల్పించి అండగా ఉంటే, జగన్ వచ్చి దాన్ని రద్దు చేసి నిరుద్యోగుల పొట్ట కొట్టారు. జగన్ చేతకానితనం వల్ల గత 20 నెలల పాలనలో రాష్ట్రానికి రావాల్సిన సుమారు రూ.2 లక్షల కోట్లు పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి.
ఆటో డ్రైవర్ల కోసం ఆటో స్టాండ్ ఏర్పాటు చేసి, మంచి నీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పిస్తామని లోకేష్ తెలిపారు. అధికారంలోకి వచ్చాక పారిశుద్య కార్మికులకు రూ.21 వేల వరకు జీతాలు పెంచుతామని లోకేశ్ హామీ ఇచ్చారు.