రాష్ట్రంలో కాపులే టార్గెట్ గా పరోక్షంగా జరుగుతున్న దాడులను కాపు సంక్షేమ యువ సేన తీవ్రంగా ఖండించింది. తిరుపతి లోని ప్రెస్ క్లబ్ లో నేడు కాపు సంక్షేమ యువసేన అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కాపు కులస్తుల్ని టార్గెట్ చేసిన జగన్ రెడ్డి చర్యల్ని తీవ్రంగా ఖండించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి జగన్ రెడ్డి వ్యక్తిగత దూషణలకు దిగడం చాలా విచారకరం అని అన్నారు.
కాపు కులస్తులు రాజ్యాధికారం వైపు పయనిస్తుంటే వారిపై బురదజల్లే కార్యక్రమాన్ని జగన్ రెడ్డి కాపు మంత్రులతో చేయించడం సరికాదు అని చెప్పారు. అంతేకాకుండా మాజీ మంత్రి, నారాయణ స్కూల్ మాజీ అధినేత నారాయణ ను కుట్ర పూరిత ఉద్దేశ్యంతో అరెస్ట్ చేయడాన్ని కాపు సంక్షేమ సేన ఖండించింది.
రాష్ట్రంలో ఆర్ధికంగా మరియు రాజకీయంగా బలంగా వున్న కాపు నాయకులను అణచివేసి భయబ్రాంతులకు గురిచేసి వారిని మానసికంగా హింసించడం జగన్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని అన్నారు. 2014లో నారాయణ స్కూల్ అధినేతగా రాజీనామా చేసిన ఆయన్ను ఎవరో చేసిన పేపర్ లీకేజీ ని ఆయనకు ఆపాదించడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
కాపులను కాపు నాయకుల చేతే తిట్టించడం వారు ఇచ్చే పదవులకు ఆశపడి తమ కులంలోని వారిని దూషించడం ఇకనైనా మానుకోవాలని, పదవులు ఎవరికీ శాశ్వతం కాదని ఆర్కాట్ కృష్ణప్రసాద్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాపులు కీలక పాత్ర పోషించడం ఖాయం అని, కాపులను దూషించడం మానుకొని కాపు జాతి అభివృద్ధికి పనిచేయాలని లేదంటే మీరు కాపు ద్రోహులుగా చరిత్రలో మిగిలి పోతారని ఆయన హెచ్చరించారు.
రాబోయే ఎన్నికల్లో జగన్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవడం ఖాయమని ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ అన్నారు. చంద్రగిరి నియోజకవర్గ కాపు సంక్షేమ యువసేన అధ్యక్షులు రాజ రాయల్ తో బాటు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుత్తూరు గోపీ రాయల్, జిల్లా అధికార ప్రతినిధి గోపీనాథ్ రాయల్, సాయి రాయల్, వినయ్ రాయల్, బెల్లంకొండ రమేష్ రాయల్ , యర్రంశెట్టి సుబ్రమణ్యం, దండు లక్ష్మీ పతి, రాష్ట్ర రైతు విభాగ ఉపాధ్యక్షులు కృష్ణయ్య పాల్గొన్నారు.