హైదరాబాద్ లోని జగద్గిరిగుట్ట లో ఉన్న రాజీవ్ గృహకల్ప కబ్జాల మయంగా మారింది. మరీ ముఖ్యంగా మహిళా భవన్ కోసం కేటాయించిన స్థలాన్ని కూడా వదలకుండా కబ్జాదారులు ఆక్రమించేస్తున్నారు. స్థానిక నాయకులు వారికి వత్తాసు పలుకుతున్నారు. రెవెన్యూ అధికారులు లంచాలకు మరిగి స్థలం కబ్జాకు గురి అవుతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. పది సంవత్సరాల కిందట అప్పటి కలెక్టర్ వాణీ ప్రసాద్ ఇక్కడ మహిళా భవన్ కోసం రెండు వేల చదరపు గజాల జాగాను కేటాయించారు. వెయ్యి గజాలలో మహిళా భవన్ నిర్మాణం చేసుకోవాలని, మరో వెయ్యి గజాల స్థలంలో అంగన్ వాడీ భవన్, ఆసుపత్రి నిర్మించాలని ఆమె నిర్దేశించారు. అయితే ఆ నాటి నుంచి ఈ నాటి వరకూ కూడా అక్కడ మహిళా భవన్ గానీ అంగన్ వాడీ భవన్ గానీ ఆసుపత్రి గానీ నిర్మాణం జరగలేదు. నిర్మాణం జరగకపోగా ఆ స్థలంపై కబ్జా రాయుళ్లు కన్నేశారు. దాన్ని దిగమింగేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఇల్లు కట్టేస్తున్నారు. తాము ఫిర్యాదు చేసినప్పుడల్లా రెవెన్యూ అధికారులు వచ్చి లంచాలు తీసుకుని వెళ్లిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతుందని సొసైటీ సభ్యులు, మాజీ సొసైటీ సభ్యులు కొన్ని సంవత్సరాల నుంచి మండల రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోలేదని వారు అంటున్నారు. మహిళ భవన్ కి కేటాయించిన 2000 గజాల జగాను ఇప్పుడు కబ్జా చేసి రాత్రికి రాత్రే భవనం కట్టడం జరుగుతుందని ప్రజలు వాపోతున్నారు. రెవెన్యూ అధికారులు మేల్కొని కబ్జాదారుల పై తగిన చర్యలు తీసుకోని కబ్జాకు గురైన జాగా లను తక్షణమే ప్రజల అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాలని ప్రజలు కోరుకుంటున్నారు. అక్రమ నిర్మాణాలను వెంటనే కూలగొట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
previous post