మహానేత బాబు జగ్జీవన్ రామ్ జీవితాంతం అణగారిన వర్గాలకు సమానత్వం కోసం పోరాటం చేశారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కొనియాడారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా బుధవారం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మాట్లాడుతూ ఆయనను జీవితాంతం గుర్తుంచుకొని, ఆయన మార్గంలో కొనసాగడమే ఆయనకు మనం నిజంగా ఇచ్చే నివాళి అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దళిత నేతలు, వైసిపి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళలపైనే పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్నారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. కస్తూరి దేవి గార్డెన్స్ లో బుధవారం జరిగిన రూరల్ నియోజకవర్గ (నగర) పరిధిలోని వైయస్సార్ ఆసరా మూడో విడత సంబరాల కార్యక్రమంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంతో పోలిస్తే ప్రస్తుతం మహిళల్లో చైతన్యం ఎంతో పెరిగిందని, ఇప్పుడు హుందాగా బయటకు రావడం, మాట్లాడటం చూస్తే ముచ్చటేస్తుందన్నారు.
వైయస్ ఆసరా కార్యక్రమం నుంచి లభించే ప్రయోజనాన్ని కుటుంబ వృద్ధికి, పిల్లల చదువుకు వినియోగించాలని కోరారు. 2019 ఏప్రిల్ 11వ తేదీ సీఎం జగన్ మహిళలకు పాదయాత్రలో ఇచ్చిన హామీని విడతల వారీగా అమలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికి మూడు విడతలు పూర్తి చేసిన సీఎం, నాలుగో విడతను కూడా ఇచ్చేందుకు సిద్ధపడ్డారని తెలిపారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా, మాట ఇచ్చిన పథకాలను అమలు చేస్తున్నారని ప్రశంసించారు. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ తో పాటు మమ్మల్ని కూడా మీ ఓటుతో ఆశీర్వదించాలని కోరారు. ఎంపీ ఆదాల 16.93 కోట్ల రూపాయల ఆసరా చెక్కును మహిళా సమాఖ్యకు మంత్రితో కలిసి అందజేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, జెడ్పిపి చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, వైసిపి జిల్లా అధ్యక్షురాలు మొయిళ్ళ గౌరీ ఆసరా పథకం ద్వారా మహిళలకు జరుగుతున్న మేలు గురించి మాట్లాడారు. విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, డిఆర్డిఏ పిడి సాంబశివరెడ్డి, కార్పొరేటర్లు, వైసిపి నేతలు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు జ్యోతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఈ ఉత్సవాల్లో భాగంగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.