జనసేనాని తిరుపతి పర్యటన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలలో ఆత్మస్థైర్యాన్ని నింపింది. పార్టీ క్యాడర్ కు ఎం జరిగినా, అధినేత ఉన్నారని భరోసా కల్పించింది. పార్టీ క్యాడర్ మరింత చురుగ్గా పనిచేయడానికి ఉత్సాహం నింపింది. అధినేత ఆదుకుంటారన్న నమ్మకం, విశ్వాసం పార్టీలో కలిగింది. మరో వైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రతిష్టను ఇనుమడింపచేసింది. పవన్ వ్యవహార శైలి ఇతర పార్టీలు, ముఖ్యంగా తెదేపాకు చెంపపెట్టుగా మారింది. అంజూయాదవ్ అకృత్యాలు శ్రీకాళహస్తిలో నిత్యకృత్యాలు. తెదేపా నాయకులు, కార్యకర్తలకు అవమానాలు జరిగినా, ఆ పార్టీ తగిన విధంగా స్పందించలేదని విమర్శలు ఉన్నాయి.
సోమవారం తిరుపతి వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ స్థాయిలో ప్రజలు స్వాగతం పలికారు. తమ పార్టీ కార్యకర్త కొట్టే సాయిపై చేయిచేసుకున్న శ్రీకాళహస్తి సిఐ అంజూ యాదవ్ పై జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డికి ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక విమానంలో వచ్చారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఇతర నాయకులతో కలిసి విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అనంతరం పవన్ ర్యాలీగా తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు.
సిఐ అంజు యాదవ్ పై ఫిర్యాదు చేశారు. శ్రీకాళహస్తికి చెందిన పార్టీ కార్యకర్త కొట్టె సాయిపై చేయి చేసుకున్న సిఐ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు నాదెండ్ల మనోహర్, జిల్లా నాయకులు డాక్టర్ హరిప్రసాద్, కిరణ్ రాయల్, రాజా రెడ్డి, కొట్టే సాయి తదితరులు ఉన్నారు. అయితే ఈ పర్యటన పవన్ ప్రతిష్టను అనూహ్యంగా పెంచి వేసింది. ఆయన పర్యటన రెండు రోజుల ముందు తెలిసినప్పటికీ వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి రావడం రాజకీయ చర్చకు దారి తీసింది. విమానాశ్రయం నుంచి బయలు దేరిన ఆయన భారీ కాన్వాయ్ కి అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పట్టారు. గజమాలలతో సత్కరించారు.