వర్కింగ్ జర్నలిస్టుల ఆరోగ్య పధకం, ప్రమాద భీమా పధకాలను వచ్చే మార్చి వరకు కొనసాగిస్తామని రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ విజయకుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆమేరకు అవసరమైన ఉత్తర్వులు త్వరలో ఇస్తామని ఆయన తెలిపారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నాయకులు కమిషనర్ ను కలసి పలు సమస్యల పరిష్కారం పై మాట్లాడారు.
ఐజేయు ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ఏపీయుడబ్ల్యూ జే అధ్యక్షుడు ఐ. వి. సుబ్బారావు, ప్రధానకార్యదర్శి చందు జనార్దన్, కృష్ణా అర్బన్ కమిటీ అధ్యక్ష, కార్యదర్సులు చావా రవి, కొండా రాజేశ్వరరావు తదితరులు కమిషనర్ ను కలిశారు. జర్నలిస్టులు ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే హెల్త్ స్కీమ్, ప్రమాద భీమా పధకాలను ఈ ఏడాది కొనసాగించనున్నట్లు తెలిపారు.
ఆర్ధిక శాఖ క్లియరెన్స్ రాగానే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు. అక్రిడేషన్స్ ప్రక్రియలో అర్హత ఉన్న జర్నలిస్ట్ లకు ఇబ్బంది రానివ్వమని తెలిపారు. ఏదన్నా కేంద్రం లో కొత్తగా వచ్చిన రిపోర్టర్ అన్ని పత్రాలు తో దరఖాస్తు చేసుకుంటే దానినే పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు.
ఇప్పటికి 28 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఇంటి స్థలాల కేటాయింపు కోసం ప్రత్యేక జీవో విషయం పై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. కరోనా విపత్తు నేపధ్యం లో ప్రతి జర్నలిస్ట్ కు తక్షణం రూ 10 వేలు ఇవ్వాలన్న డిమాండ్ పై స్పందిస్తూ ప్రభుత్వ పరిశీలనలో ఆ విషయం ఉందన్నారు.