26.7 C
Hyderabad
April 27, 2024 08: 51 AM
Slider ప్రత్యేకం

కిరాతకంగా అత్యాచారం హత్య చేసినా ప్రశాంతంగా ఉరి

nirbhaya convicts 20

నిర్భయ దోషులను మార్చి 20న ఉరితీయాలని ఢిల్లీ కోర్టు ‘డెత్ వారెంట్’ జారీచేసిన నాటి నుంచి ఉరి తీసేవరకూ ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దేశ చరిత్రలో తొలిసారిగా నలుగురు దోషులను ఒకేసారి ఉరితీశారు. తీహార్‌ జైలులో ఉరిశిక్ష అమలు చేసే జైలు నెంబర్‌ 3 చేరువలోకి జైలు అధికారులు ఈ నలుగురిని తరలించారు.

బుధవారం సాయంత్రం నుంచి వారి ప్రవర్తనలో మార్పు కనిపించింది.  దోషులను వేర్వేరు సెల్స్‌లో ఉంచారు. సీసీ టివి ద్వారా వీరిని జైలు అధికారులు పర్యవేక్షించారు. తీహార్‌ జైలు డైరెక్టరేట్‌ వర్గాల సమాచారం ప్రకారం నలుగురు దోషులను ఒకేసారి ఉరిశిక్షకు తీసుకువెళ్ళారు.

నలుగురు దోషులు ఎటువంటి ఇబ్బందులను సృష్టించలేని విధంగా అత్యంత అప్రమత్తతతో అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆసియాలో అతిపెద్ద జైలు అయిన తీహార్‌ జైలులో తలారి పవన్‌ జల్లాడ్‌ వారికి ఉరి శిక్ష అమలు జరిపారు. ఉరి తీసేందుకు ఒక అంగుళం (రెండున్నర సెంటీవిూటర్ల) వ్యాసం, 19 అడుగుల పొడవు ఉండే 10తాళ్ళను బిహార్‌లోని బక్సార్‌ నుంచి తీసుకొచ్చారు.

ఖైదీ బరువుకు ఒకటిన్నర రెట్లు బరువు ఉండే ఇసుక బస్తాలతో వారం రోజుల ముందే ఒకసారి, గురువారం మరోసారి పరీక్షించారు. అలాగే ఒకొక్కరికి రెండు ఉరి తాళ్ళ చొప్పున ఎనిమిది తాళ్ళను, అదనంగా మరో రెండు ఉరితాళ్ళను పరీక్షించారు. అనంతరం వాటిని ప్రత్యేక లాకర్‌లో లాక్‌ చేశారు.

ముకేశ్‌ సింగ్‌, అక్షయ్‌ ఠాకూర్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మలకు ప్రతిరోజులాగే ఒకరి తర్వాత ఒకరికి వేర్వేరుగా వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఈ నలుగురు వారి చివరి కోరిక ఏమిటో ప్రత్యేకంగా చెప్పలేదు. ఉరి తీసే ముందు కూడా వారి ముఖాల్లో భయం, కుంగుబాటు లేదు. తప్పుచేశామనే పశ్చాత్తాపం కూడా కనిపించలేదు.

వీలునామా రాసే అవకాశం ఉన్నా చేయలేదు. రాత్రికి ఈ నలుగురు ఖైదీలు ఎలాంటి కొత్త రకం భోజనం కోరలేదు. ఏమీ తినలేదు.

ఈ నలుగురు గురువారం రాత్రి అంతా నిద్రపోలేదు. జైలు నిబంధనల ప్రకారం వారిని శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు నిద్ర లేపారు. 10 నిమిషాల తర్వాత అంటే 2.40 స్నానం చేయాల్సిందిగా జైలు అధికారులు చెప్పారు. వీరు అన్య మనస్కంగా స్నానం ముగించారు.

ఎస్పీ, డీఎస్పీ, ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌, వైద్యాధికారి నలుగురూ కలిసి ఖైదీలు ఉన్న సెల్‌ వద్దకు చేరుకున్నారు. ‘డెత్ వారెంట్‌’లో ఉండే వివరాలతో ఈ నలుగురు ఖైదీల వివరాలను సరిపోల్చుకున్నారు. తరువాత ఈ ఖైదీలకు అతడి మాతృభాష హిందీలో ‘అతను చేసిన నేరం ఏమిటి..?’ విధించిన శిక్షకు సంబంధించిన తీర్పు, అమలు వారెంట్‌ను ఖైదీకి అర్థమైయ్యే భాషలో చదివి వినిపించారు.

తెల్లవారుజామున 3గంటలకు ఖైదీలకు అల్పాహారం అందించారు. అయితే ఈ నలుగురు ఎలాంటి అల్పాహారం తీసుకోలేదు.’ఏదైనా మతపరమైన పుస్తకం కావాలా..’అని అధికారులు ఈ నలుగురిని అడిగారు. వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. ప్రార్థన చేసుకునే అవకాశం ఉన్నా చేయలేదు.

అనంతరం డిప్యూటీ సూపరింటెండెంట్ సమక్షంలో ‘సెల్‌’లోనే ఖైదీల చేతులకు వెనక నుంచి బేడీలు వేశారు. ఒకొక్క ఖైదీని ఇద్దరు వార్డెన్‌లు భుజాలను పట్టుకొని ‘ఉరి కంభం’ వైపు నడిపించారు. ఈ ఖైదీలకు ముందు వైపు ఇద్దరు వార్డెన్‌లు, వెనుక వైపు ఇద్దరు వార్డెన్‌లు ప్రొటోకాల్ ప్రకారం ఉన్నారు.

ఈ సమయంలో జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌తో పాటు హెడ్‌ వార్డెన్, మరో ఆరుగురు వార్డెన్‌లు కూడా ఉన్నారు. ఉరి కంబం దగ్గర అప్పటికే సూపరింటెండెంట్, మెజిస్ట్రేట్, వైద్య అధికారి సిద్ధంగా ఉన్నారు. ఉరితీతకు ముందు జరగాల్సిన ప్రక్రియలన్నీ పూర్తయినట్లు సూపరింటెండెంట్, మెజిస్ట్రేట్‌కు వివరించారు.

తరువాత ఈ నలుగురు ఖైదీలకు తలారీకి అప్పగించారు. ఖైదీలను ఉరి కంబం కింద నిల్చొబెట్టే వరకు వార్డెన్‌లు ఆ నలుగురు ఖైదీల చేతులు పట్టుకొనే ఉన్నారు. ఉరికంబం వద్దకు ఖైదీని తీసుకెళ్ళారు. ఉరికంబం ఎక్కించారు. ఆ తర్వాత ఉరి తీసే సందర్భంగా కాళ్ళు కదలకుండా రెండు కాళ్ళను చిన్న తాడుతో గట్టిగా కట్టారు.

అనంతరం నల్లటి ముసుగులు వేశారు. అయితే అరవకుండా నోటిలో గుడ్డలు పెట్టడం, నోటిని మూయటం కానీ చేయలేదు. మేజిస్ట్రేట్ టైం చూసుకొని సంకేతం ఇచ్చారు. ఆ నలుగురు ఖైదీల కాళ్ల కింద ఉన్న తలుపులు తెరుచుకునేలా తలారి ‘లీవర్‌’ ను లాగాడు. ఆ నలుగురి మెడకు ఉరితాడు బిగిసింది.

14 నుంచి 16 నిమిషాల వ్యవధిలో వారి శరీరాల కదలిక ఆగింది. అరగంట వరకు ఆ ఖైదీల శరీరాన్ని అలాగే ఉంచారు. అనంతరం ఖైదీ మరణించినట్టు వైద్యాధికారి ధ్రువీకరించారు. ఆ విషయాన్ని హోం శాఖ అధికారులకు అధికారికంగా తెలియజేశారు. నిర్భయ హంతకుల జీవితం ముగిసిపోయింది.

Related posts

కెసిఆర్ ను కలిసిన సండ్ర

Bhavani

యాసిడ్ తాగి మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజ‌న్ బ్యాంకులు ప్రారంభం

Satyam NEWS

Leave a Comment