శ్రీకాళహస్తి పట్టణం, బీపీ అగ్రహారానికి చెందిన మునీశ్వర్ (10 నెలల బాబు) లివర్ సంబంధ సమస్యతో బాధపడుతూ ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. నిరుపేద కుటుంబం అయిన బాబు తల్లిదండ్రులు సమస్యను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దృష్టికి తీసుకురాగా వెంటనే ఆయన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి సమస్యను వివరించారు. దాంతో ఆయన ఆపరేషన్ కు కావాల్సిన 17.5 లక్షలను సీఎం ఆర్థిక సహాయం నుండి తల్లిదండ్రులకు అందజేశారు.
చెన్నై గ్లోబల్ హాస్పిటల్ వైద్యులు దాదాపు 12 గంటల శ్రమించి లివర్ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి బిడ్డకు పునర్జన్మ అందించారు.
ఈ సందర్భంగా గ్లోబల్ హాస్పిటల్ వైద్యులు మాట్లాడుతూ, గత 2 సంవత్సరాల్లో 80కి పైగా పీడియాట్రిక్ లివర్ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా చేశామని కానీ మేము చేసిన ఆపరేషన్ లో అతి చిన్న వయసు వారికి ఆపరేషన్ చేయడం ఇదే ప్రథమం అన్నారు. ఈ ఆపరేషన్ కు సహకరించిన ముఖ్యమంత్రి కి అలాగే సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ,ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికి ఆరోగ్యం,విద్య అందించడమే లక్ష్యంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, శ్రీకాళహస్తి లో నిరుపేద కుటుంబంకి చెందిన మునీశ్వర్ (10 నెలల బాబు) లివర్ మార్పిడి ఆపరేషన్ కు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 17.5 లక్షలు అందజేసి నిరుపేద కుటుంబంలో వెలుగులు నింపారని తెలిపారు. అలాగే ఇంత పెద్ద ఆపరేషన్ ను 12 గంటలపాటు శ్రమించి విజయవంతంగా పూర్తి చేసిన గ్లోబల్ హాస్పిటల్ యాజమాన్యానికి, వైద్య బృందానికి ధన్యవాదాలు తెలిపారు.
బాబు తల్లిదండ్రులు మాట్లాడుతూ, మా బాబుకు పునర్జన్మ ప్రసాదించిన జగనన్నకు, ఎమ్మెల్యే మధన్నకు, గ్లోబల్ హాస్పిటల్ వైద్య బృందానికి జీవితాంతం రుణపడి ఉంటామని అలాగే గ్లోబల్ హాస్పిటల్ వైద్య బృందానికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్లోబల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ భాస్కర్, డాక్టర్ రజినీకాంత్ పాచా,డాక్టర్ సోమ శేఖర్ అలాగే పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.