యువ నేతల విందుకు తనను పిలవకపోవడంపై జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహంగా ఉన్నారని తెలిసింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల వారసులతో నారా లోకేష్ నిన్న సమావేశం అయిన విషయం తెలిసిందే. టీడీపీ నేతల రాజకీయ వారసులతో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు ఆదివారం హైదరాబాద్లో విందు సమావేశం నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతల కుటుంబాలకు చెందిన వారసులను ఈ విందుకు ఆహ్వానించారు. వారసుల భార్య/భర్తలను సైతం పిలిచారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఆహ్వానం లేదు. దాంతో నారా లోకేష్ పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కోపంతో రగిలిపోతున్నారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ సమావేశం కొనసాగింది.
చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరిలు సైతం కొద్దిసేపు ఈ భేటీలో పాల్గొన్నట్లు సమాచారం. అయితే పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వారికి మాత్రమే ఆహ్వానం పంపామని లోకేష్ కార్యాలయం తెలిపింది. జూనియర్ ఎన్టీఆర్ విషయం పై వ్యాఖ్యానించేందుకు ఎవరూ సిద్ధంగా లేరు.