ప్రభుత్వాన్ని నిలదీస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులపై వేధింపులు ఆగడం లేదు. తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రాణాలకు ప్రమాదం తెచ్చే నిర్ణయాలను కూడా ప్రభుత్వం తీసుకుంటున్నది. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సెక్యూరిటీ ని తాజాగా ప్రభుత్వం తొలగించింది.
పయ్యావుల కేశవ్ కు నిన్నటివరకు 1+1 సెక్యూరిటీ ఉండేది. సెక్యూరిటీ పెంచాల్సింది పోయి నేడు పూర్తిగా సెక్యూరిటీని ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది. కొద్దిరోజులుగా పెగాసస్, ఫోన్ ట్యాపింగ్ పై కీలక ఆధారాలు పయ్యావుల కేశవ్ బయటపెడుతున్నారు.
అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న ఆర్ధిక అవకతవకలను పయ్యావుల బయటపెట్టారు. ప్రభుత్వానికి ఆయన సంధిస్తున్న ప్రశ్నలు పాలనాపరంగా తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నాయి. సాధరణంగా అయితే ఇలా ఆధారాలతో సహా పాలనాపరమైన అంశాలను ఎవరైనా బయటపెడితే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి.
అయితే ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం అలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా అలాంటి నాయకులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నది. ఈ నేపథ్యంలోనే పిఏసి చైర్మన్ అయిన పయ్యావుల కేశవ్ కు భద్రతను పూర్తిగా తొలగించారని తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలిపాయి. వైసీపీ నుంచి బలమైన బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో పయ్యావులకు అధికారులు భద్రదత పెంచాల్సి ఉంది. అలా పెంచకపోగా పూర్తిగా తొలగించారు ఏపి పోలీసు అధికారులు.
అయితే ఈ వార్తను అనంతపురం పోలీసులు తీవ్రంగా ఖండించారు. కేశవ్ కు భద్రత ఉపసంహరించలేదని, సెక్యూరిటీని అదే విధంగా కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.