కడప జిల్లా నందలూరు మండలం సోమశిల మునక ప్రాంతం కుంపిణీ పురంకు చెందిన సాయి నరసింహులు (55) కువైట్ లోని పర్వానియా ప్రాంతంలో శనివారం ఉదయం గుండె పోటుతో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దాదాపు 20 సంవత్సరాల క్రితం కుటుంబ పోషణ నిమిత్తం సాయి నరసింహులు కువైట్ కు వెళ్ళాడు.
తల్లి లక్ష్మీ నరసమ్మ (80),భార్య ఆది లక్ష్మీ, పెద్ద కూతురు మహా లక్ష్మి వివాహం కాగా , చిన్న కూతురు పద్మా 7వ తరగతి చదువుతోంది. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి పంజా విసరడం తో సాయి నరసింహులు కువైట్ నుంచి స్వదేశానికి రావాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ఆందోళన వల్లనే గుండెపోటు
కువైట్ లో కరోనా మూలంగా పనులు లేక పోవడం,అక్కడ కూడా గత రెండు రోజుల నుంచి లాక్ డౌన్ ప్రకటించడం తో నిబంధనలు కఠినంగా ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఇంటికి రావాలనే ప్రయత్నాలు ఫలించక సాయి నరసింహులు ఆందోళనతో గుండెపోటుతో మృతి చెందినట్టు బంధువులు తెలిపారు.
కువైట్ లో చాలిచాలని జీతంతో జీవితం నెట్టుకొస్తున్న సాయి నరసింహులు మృతి చెందడంతో కుటుంబం బోరున విలపిస్తోంది. తలకొరివి పెట్టవలసిన కొడుకు ఇక లేడనే వార్త విని వృద్ధురాలు రోదిస్తోంది. దిక్కులేని తమని ఆదుకోవాలని వారు దీనంగా వేడు కొంటున్నారు. లేకుంటే ఆత్మహత్యలే శరణం మన్నారు.
కాగా సాయి నరసింహులు మృత దేహం ఇప్పుడు ఉన్న పరిస్థితి లో,ఎలా ఎప్పుడు ఇంటికి చేరుతుందో తెలియక వారు ఆందోళన చెందుతున్నారు. కాగా మృతుని కుటుంబానికి 10 లక్షల నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని ఎన్నారై ఆకుల నరసయ్య ప్రభుత్వంను కోరారు.