ఆర్థిక స్తోమత లేని నిరుపేద ప్రజల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే “కల్యాణమస్తు” కార్యక్రమాన్ని నిలిపివేసినట్లు కనిపిస్తున్నదని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. టిటిడి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నిరుపేద వధూవరుల కోసం 2007 లో కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రారంభించి ఇప్పటివరకు ఆరుసార్లు దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. కరోనా కారణంగా రెండు సంవత్సరాలు నిర్వహించలేకపోయారు. సామూహిక వివాహాలను పునః ప్రారంభిస్తామని బహిరంగ ప్రకటన చేసిన టీటీడీ ధర్మకర్తల మండలి, ఉన్నతాధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాలి అని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
“నిత్య కళ్యాణం పచ్చ తోరణం” శ్రీవారి ఆశీస్సులతో కళ్యాణమస్తు ద్వారా వివాహం చేసుకోవడం పేద వధూవరులు పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. 26 జిల్లాల నుంచి అనేకమంది దరఖాస్తులు చేసుకుని టీటీడీ ఖరారు చేసిన 2022 ఆగస్టు 7 ముహూర్తం గడువు దాటిపోయి సంవత్సరం కావస్తున్నా టీటీడీ నుంచి ఎటువంటి సమాచారం లేక నిరుపేద వధూవరులు నిరుత్సాహంతో ఎదురుచూస్తున్నారు. టిటిడి ప్రకటించిన ముహూర్తానికి కళ్యాణమస్తు కార్యక్రమం ద్వారా పేద వధూవరులకు వివాహాలు జరిపించకపోవడం టిటిడి అధికారుల వైఫల్యమా లేక నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ఆయన అన్నారు. పేద కుటుంబాల లోని వధూవరులకు వివాహాలు ఆర్థిక భారం కాకుండా కళ్యాణమస్తు ద్వారా ఉచిత సామూహిక వివాహాల కార్యక్రమాన్ని టిటిడి ధర్మకర్తల మండలి ఉన్నతాధికారులు యధావిధిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.