తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడిపై అనునిత్యం అసభ్య పదజాలంతో వ్యాఖ్యానాలు చేసే మంత్రి అంబటి రాంబాబుకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం అయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అంబటి రాంబాబు వేరే నియోజకవర్గం వెతుక్కునే పరిస్థితి తలెత్తింది. అంబటి రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తే ఆయన ఓటమికి బాటలు వేసే రీతిలో సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణను ఆ నియోజకవర్గం నుంచి రంగంలో దించేందుకు చంద్రబాబు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈ మేరకు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో పర్యటించినట్లు చెబుతున్నారు. చాప కింద నీరు లా సత్తెనపల్లి నియోజకవర్గం లో అన్ని గ్రామాల ను సందర్శించిన కన్నా కొన్ని పార్టీలకు సంబంధించి ద్వితీయ శ్రేణి నాయకులకు మాట ఇస్తున్న వైనంతో పరిస్థితి ఆయనకు అనుకూలంగా మారింది. ఒక్క తెలుగుదేశం పార్టీకి చెందిన వారే కాకుండా అన్ని పార్టీలకు చెందిన నాయకులు కన్నా పోటీకి దిగుతున్నారని తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెల నుండి సత్తెనపల్లి నియోజకవర్గంలో తన కార్యాచరణ మొదలు పెట్టనున్న కన్నా లక్ష్మీనారాయణ, సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసిపి అసమ్మతి నాయకులే టార్గెట్ గా ముందుకు వెళుతున్నారు.