రెడ్ల ఓట్లు, కమ్మ ఓట్లు ఫిక్స్ అయిపోయినట్లున్నాయి… ఇప్పుడు కాపు ఓట్ల కోసం మీటింగులు జరుగుతున్నాయి. వైసీపీ కి చెందిన కాపు నేతలు రాజమండ్రిలో సమావేశం అవుతున్న నేపథ్యంలో తిరుపతిలో బలిజ కులస్తులు మీటింగ్ ఏర్పాటు చేశారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పని చేసిన బలిజ నాయకులు తిరుపతిలో సమావేశం కావడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
ఈ సమావేశానికి వైసీపీకి చెందిన బలిజ నాయకులు హాజరు కాలేదు. అంటే ఈ సమావేశానికి తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన బలిజ నాయకులే హాజరు అయ్యారన్నమాట. రేపు రాజమండ్రిలో వైసీపీ కాపు నేతల భేటీతో తిరుపతి సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. టీడీపీ-జనసేన పొత్తు వార్తలతో రెండు పార్టీల్లోని బలిజ సామాజికవర్గం నేతలు ఏకమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
రాష్ట్రంలో మరిన్ని చోట్ల ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని కూడా అనుకుంటున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగానే తిరుపతిలో భేటీ అయ్యామని పూర్వ ప్రజారాజ్యం పార్టీ నేతలు అంటున్నారు. టీడీపీ-జనసేన పొత్తుల చర్చలు, రేపు రాజమండ్రిలో జరిగే కాపు నేతల సమావేశంతో తమకు ఎలాంటి సంబంధం లేదని పూర్వ ప్రజారాజ్యం పార్టీ నేతలు స్పష్టం చేశారు.
అయితే ఆత్మీయ కలయిక పేరుతో పూర్వ ప్రజారాజ్యం పార్టీ నేతలు తిరుపతిలో సమావేశం కావడం రాష్ట్ర రాజకీయవర్గాల్లో కలకలం రేపింది. టీడీపీ, బీజేపీ, జనసేనలోని పూర్వ ప్రజారాజ్యం పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరవడం ఆసక్తికరంగా మారింది. అన్ని సామాజికవర్గాల సమాహారం ప్రజారాజ్యం అని ఈ సమావేశ నిర్వహకులు తెలిపారు. పార్టీలకు, కులాలకు అతీతంగా అంతా ఈ సమావేశానికి వచ్చారని చెప్పారు. పూర్వ ప్రజారాజ్యం పార్టీ నేతలందరిని ఒకటి చేయాలనే ఈ మీటింగ్ పెట్టామన్నారు.