తెలంగాణ రాష్ట్రంలో జరిగేది రాచరిక పాలన కాదు. ఇది ఒక సంక్షేమ రాజ్యం అన్నది రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని ములుగు నియోజక వర్గ, జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు. సోమవారం రోజున ములుగు జిల్లాలోని పస్రా గ్రామంలో భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసిఆర్ పై రేవేంత్ రెడ్డి చేసిన వాఖ్యలపై మీడియాతో మాట్లాడుతూ ఆయన తీవ్రంగా స్పందించారు.
కొడంగల్ నియోజక వర్గంలో కనీస ఎమ్మెల్యే స్థానానికి కూడా ప్రజల మద్దతుతో గెలువలేని రేవంత్ రెడ్డి వచ్చి యాత్ర పేరుతో ములుగు జిల్లాలో కేసిఆర్ పై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి పాలనలోనే రైతుకు కనీస మద్దతు ధర లభించిందని గత ప్రభుత్వాలు ఏనాడు రైతును పట్టించుకున్న దాఖలాలు లేవన్న విషయం గుర్తు చేశారు. మేడారం తొలి అడుగుతో కేసిఆర్ ను గద్దె దించడం అతనివల్ల కాదని అదే కాంగ్రెస్ పార్టీకి ఆఖరి అడుగు అవుతుందని సమ్మక్క సారలమ్మల స్పూర్తితో ప్రజలు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తుదముట్టించడం ఖాయమని యాత్రల పేరుతో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ సంక్షేమ రాజ్యాన్ని తెలంగాణలో నడిపిస్తున్న కేసిఆర్ ను విమర్శించడం మాని చేతనైతే పార్లమెంట్ లో ఇదే ములుగు జిల్లా కోసం మేడారం జాతీయ హోదా, ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటి కోసం రేవంత్ కోట్లాడితే బాగుంటుందని హితవు పలికారు.
కేసిఆర్ ఆమరణ దీక్ష ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్న విషయం, కేసిఆర్ మూలంగానే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ది పథంలో నడుస్తూ, ఈ రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు ఈ రోజు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోని మాట్లాడాలన్నారు.