తెలంగాణ ప్రభుత్వ సహకారంతోనే ఖమ్మం నగర ప్రజలకు కావాల్సిన అన్ని మౌళిక వసతులు, సౌకర్యాలు కల్పించగలిగామని, కనీస సదుపాయాలు లేని స్థాయి నుండి మెట్రో నగరాలకు ధీటుగా ఖమ్మం ను తీర్చిదిద్దామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
ఖమ్మం నగరంలో పలు డివిజన్లలో ఎస్.డి.ఎఫ్, సుడా నిధులు రూ.3.80 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి 50వ డివిజన్ లో ఎస్.డి.ఎఫ్ నిధులు రూ.90 లక్షలతో నిర్మించనున్న సిసి డ్రెయిన్ల, 48వ డివిజన్ లో రూ.90 లక్షలతో నిర్మించనున్న సిసి డ్రైన్లు, 42వ డివిజన్ రాతి దర్వాజ వద్ద రూ.90 లక్షలతో నిర్మించనున్న సిసి డ్రెయిన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వైరా రోడ్డు వద్ద సుడా నిధులు రూ. 20లక్షలతో విడిఎఫ్ టెక్నాలజీతో నిర్మించిన సిసి రోడ్ ను ప్రారంభించారు.
38వ డివిజన్ ఖిల్లా లో ఎస్.డి.ఎఫ్. నిధులు రూ. 90 లక్షలతో నిర్మించనున్న సిసి డ్రెయిన్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక్క ఆర్ధిక సంవత్సరంలోనే ఎస్.డి.ఎఫ్. నిధులు రూ. 50కోట్లు, సుడా నిధులు రూ.12కోట్లు, ఎల్.అర్.ఎస్. నిధులు రూ. 20 కోట్లు, ఇలా కోట్లాది రూపాయలు నిధులు తెచ్చుకున్నామన్నారు.
శరవేగంగా అభివృద్ది చెందుతున్న ఖమ్మం నగరానికి మరో రూ. 300 కోట్ల పనులు ఉన్నాయని వాటికి తెచ్చుకుంటే ఖమ్మం నగరం పూర్తి స్థాయిలో అభివృద్ది చేసుకున్న వారం అవుతామని పేర్కొన్నారు.ప్రతి డివిజన్ లో దాదాపు మూడు కిలోమీటర్ల మేర సీసీ డ్రెయిన్లు వేస్తున్నామని, కార్పోరేషన్ మొత్తం 33 కిలోమీటర్లు పూర్తిస్థాయిలో కాల్వల నిర్మాణం చేస్తామన్నారు. నగరంలో గతంలో 25 వేల నల్లా కనెక్షన్స్ ఉండగా, నేడు 75 వేల నల్లాల కనెక్షన్స్ ను ఇంటింటికీ
ఇచ్చామన్నారు.