హైదరాబాదు గణేష్ నిమజ్జనం బందోబస్తు విధులకు వెళ్లిన వియం.బంజారా పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ ధారవత్ లచ్చిరామ్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందగా మేమున్నామంటూ..ముందుకు వచ్చి తోటి సిబ్బంది ఆదుకున్నారు.
మృతుని కుటుంబానికి రెండు లక్షల డెబ్భై వేలు ఆర్ధిక సహాయం చేసిన 2000 బ్యాచ్ కానిస్టేబుళ్లు మానవత్వాన్ని చాటుకున్నారు. తమతో పని చేస్తున్న కానిస్టేబుల్ ఉన్నట్టుండి అనారోగ్యంతో మృతి చెందాడు. తమతో ఉన్న జ్ఞాపకాలు ఆ పోలీసులు మర్చిపోలేకపోతున్నారు.
బ్యాచ్ పోలీసులంతా ఒక్కటై అందరూ కలిసికట్టుగా ఉండి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని నిశ్చయించుకున్నారు. దీంతో అంతా ఒక్కటయ్యారు. తలా ఇంతా వేసి రెండు లక్షల డెబ్భై వేల రూపాయలు సమకూర్చి ఫిక్సిడ్ డిపాజిట్ చెక్కును ఖమ్మం పోలీసు కమిషనర్ విష్ణు యస్. వారియర్ చేతుల మీదుగా మృతిని కుటుంబ సభ్యులకు అందజేసి ఆదర్శంగానిలిచారు.
పోలీస్ కానిస్టేబుల్ కుటుంబాన్ని ఆదుకున్న పోలీసులను పోలీస్ కమిషనర్ అభినందించారు. పిల్లల చదువుల కోసం సహాయ సహకారం అందిస్తామని, శాఖపరంగా రావలసిన బెన్ఫిట్స్ త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో సిఐ శ్రీనివాస్, ఎస్సై రాము, కానిస్టేబుల్ అజయ్, బాలజీ, సీరాజుద్దీన్, చిన్న, వాసు పాల్గొన్నారు.