ఈ నెల 15వ తేదీ నుండి 17 వ తేది వరకు జరిగే సలేశ్వరం జాతరకు అటవీ శాఖ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మేరకు అప్పాయపల్లి అటవీ ప్రాంతాన్ని నేడు నాగర్ కర్నూల్ జిల్లా అటవీ అధికారి జి. కిష్టాగౌడ్ తో కలిసి కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజర్ శరత్ చంద్రారెడ్డి సందర్శించారు.
సలేశ్వరం జాతర జరిగే ప్రాంతంలో 24 గంటల బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. స్థానిక పోలీసులతో కలిసి అటవీ శాఖ అధికారులు బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఇటీవల అటవీ శాఖ అధికారులను తీవ్రంగా గాయపరచి తప్పించుకున్న కరుకొండ ఆంజనేయులు ఆచూకీని తెలిసిన వారు తమకు తెలపాలని ఆయన కోరారు.
ఇటీవల ఏడుగురు నేరస్తులు అటవీ శాఖ అధికారులపై దాడి చేసిన విషయం తెలిసిందే. వీరిలో ఆరుగురిని అరెస్టు చేయగా ఆంజనేయులు తప్పించుకున్నాడు. సదరు వ్యక్తి వివరాలు తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కూడా అటవీ శాఖ అధికారులు తెలిపారు.