తెలంగాణ లో కొలుకుంటున్నది అనుకున్న కాంగ్రెస్ పార్టీకి మరో దెబ్బ తగిలింది. తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారిన నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహారం మంగళవారం ముగిసింది. మంగళవారం రాత్రి మీడియా ముందుకు వచ్చిన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో పాటు తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయాలపై, కాంగ్రెస్ పార్టీలోని పరిస్థితులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆయన త్వరలో బీజేపీ లో చేరుతున్నారు. తన రాజీనామా ద్వారా మునుగోడు ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తున్నట్లు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలహీన పడటంతో పార్టీలో ఉండి కూడా తాను ఏమీ చేయలేకపోయానని ఆయన తెలిపారు. తన జిల్లాలోనే అవకాశవాద రాజకీయాలు చేసే నేతలు ఉన్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
కాంట్రాక్టుల కోసమే తాను కాంగ్రెస్ పార్టీకి తాను రాజీనామా చేస్తున్నానని కొందరు ఆరోపిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజీనామాతో మునుగోడుకు జరగనున్న ఉప ఎన్నికలో ఎవరిని గెలిపించాలన్న విషయాన్ని నియోజకవర్గ ప్రజలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.