బడుగు వర్గాల అభ్యున్నతి కోసం, తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం రాజీలేకుండా పోరాడిన మహానీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు.
స్వాతంత్ర్య సమరయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీ 8వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జన్మించి రాజకీయంగా, సామాజికంగా ఎత్తుపల్లాలను చవిచూసిన బాపూజీ ఉద్యమాలే ఊపిరిగా తన జీవితాన్ని సమాజానికి అంకితం చేశారని కొనియాడారు.
ఆయన విలక్షణ జీవితశైలి ప్రతి ఒక్కరికి అనుసరణీయమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం బాపూజీ ఆశయాల సాధన కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతుందని అన్నారు.