కర్నూలు జిల్లా శ్రీశైల మహా క్షేత్రంలో ఏప్రిల్19 న కుంభోత్సవం నిర్వహించనున్నట్టు ఈవో లవన్న తెలిపారు. చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారం రోజున ( ఏ రోజు ముందుగా వస్తే ఆ రోజు) శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం. అమ్మవారికి సాత్త్వికబలి నిర్వహించేందుకు ( కొబ్బరికాయలు,గుమ్మడికాయలు, నిమ్మకాయలు, మొదలగునవి సమర్పించడం) ఈ కుంభోత్సవం జరిపించడం ఆనవాయితి. కుంభోత్సవం రోజున స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టం. ఉత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే ప్రతి మంగళవారం, శుక్రవారం రోజులలో అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పిస్తున్నారు. ఇలా శక్రవారం అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించారు. ముందుగా అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి పసుపు,కుంకుమలతో వాటికి పూజాదికాలు చేసి తరువాత అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించారు.