ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం దారుణమైన మలుపులు తిరుగుతున్నది. దక్షిణ ఉక్రెయిన్లోని మెలిటోపోల్ నగర మేయర్ను రష్యా సైనికులు కిడ్నాప్ చేశారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తెలిపారు. మెలిటోపోల్ మేయర్ ఇవాన్ ఫెడోరోవ్ శత్రువులకు సహకరించడానికి నిరాకరించడంతో అతన్ని కిడ్నాప్ చేశారని ఒక వీడియో సందేశంలో జెలెన్స్కీ చెప్పారు.
రష్యన్ ఆక్రమణదారుల చర్యలు ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టుల మాదిరిగానే ఉన్నాయని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ హెడ్ కిరిల్లో టిమోషెంకో టెలిగ్రామ్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఉక్రెయిన్ దేశంపై రష్యా సాగిస్తున్న యుద్ధం శనివారం నాటికి 17వరోజుకు చేరుకుంది. రష్యా దండయాత్రకు ముందు మెలిటోపోల్లో కేవలం 1,50,000 మంది ప్రజలు మాత్రమే ఉన్నారు.
రష్యా సైనిక బలగాలు ఉక్రెయిన్ దేశంలోని పలు కీలక నగరాలను ముట్టడించింది. రష్యా సైనిక దాడి ప్రారంభించినప్పటి నుంచి 2.5మిలియన్ల మంది ప్రజలు ఉక్రెయిన్ దేశం నుంచి పారిపోయారు. ఉక్రెయిన్లోని కైవ్ శివార్లలోని ఇర్పిన్లో రష్యా బాంబు దాడి తర్వాత ఒక ఫ్యాక్టరీ,దుకాణం దగ్ధమయ్యాయి. రష్యా సైనికదళాలు ఉక్రెయిన్ రాజధాని నగరమైన కైవ్ కు సమీపంలో ఉన్నాయి. కైవ్ నగరంలో శనివారం రష్యా వేసిన బాంబు పేలుళ్లతో అట్టుడికింది. బాంబు పేలుళ్ల చప్పుళ్లతో కైవ్ నివాసితులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.