ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు కుముద్బెన్ మణిశంకర్ జోషీ (88) సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె రెండేళ్లుగా మంచానికే పరిమితమయ్యారు. తన స్వస్థలమైన గుజరాత్లోని నవ్సారీ జిల్లా ధరోరి గ్రామంలో తుదిశ్వాస విడిచారు.
గుజరాత్ నుంచి గవర్నర్ అయిన తొలి మహిళగా కుముద్బెన్ రికార్డులకెక్కారు. 1973 నుంచి 1985 వరకు మూడు పర్యాయాలు రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఇందిరాగాంధీ మంత్రివర్గంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ; సమాచార శాఖల మంత్రిగా సేవలందించారు.
1985-1990 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు. ఆ సమయంలో అధికార తెలుగుదేశం పార్టీతో ఆమెకు పొసిగేది కాదు. కాంగ్రెస్ ఏజెంటుగా పనిచేశారనే విమర్శలు ఎదుర్కొన్నారు. గవర్నర్గా మొత్తం 23 జిల్లాల్లో 108 సార్లు పర్యటించి రికార్డు సృష్టించారు.
అయితే ఆమె పర్యటనలన్నీ కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకేనని నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సహా మంత్రులంతా పెద్దఎత్తున విమర్శించేవారు. కుముద్బెన్ అవివాహితురాలు. అమెరికాలో ఉన్న బంధువులు వచ్చాక గురువారం ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.