పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం లో జరిగిన సారా మరణాలపై న్యాయమూర్తి చేత సమగ్ర న్యాయ విచారణ జరపాలని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యుడు కారం రాఘవ డిమాండ్ చేశారు.
జంగారెడ్డిగూడెంలో సారా తాగడం వల్ల మరణించిన కుటుంబాలను ఆదుకోవాలనీ, సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలనీ, న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఐ.ఎఫ్.టి.యు.,పి.వై.ఎల్,. పి.డి.ఎస్.యు,.పి.వో.డబ్ల్యూ.ఎ.ఐ.కె.ఎం.ఎస్. సంఘాల ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
ధర్నాను ఉద్దేశించి సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కారం రాఘవ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణ పరిధిలో గత నాలుగు రోజులుగా సారా తాగి 20 మంది వరకు చనిపోయారనీ, ఒకపక్క బాధిత కుటుంబ సభ్యులు సారా తాగడం వల్ల చనిపోయారని ప్రకటిస్తుండగా అధికారులు, ప్రజా ప్రతినిధులు మాత్రం ఇవి అనారోగ్య మరణాలని చెబుతున్నారనీ ఆయన అన్నారు.
విడతలవారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధిక రేట్లను పెంచి, మద్యనిషేధాన్ని విధించకుండా ప్రజలను దోపిడీ చేస్తున్నదని విమర్శించారు. ప్రజలకు కొనుగోలు శక్తి లేనప్పుడు అధిక రేట్లు పెట్టి బ్రాందీలు విస్కీ లు కొనలేక నాటుసారా మరియు శానిటైజర్ కూడా తాగే పరిస్థితికి ప్రభుత్వం నిరుపేద ప్రజలను తీసుకువచ్చిందనీ ఆయన అన్నారు.
ఈ దుర్మార్గమైన విదానం రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిందని, నాటుసారా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్నదనీ, కూడా లంచాలకు అలవాటు పడిన అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. కల్తీ సారా అనారోగ్యానికి గురై అనేక మంది మరణిస్తున్నారన్నారు.
అక్రమ సారాను అరికట్టి మరణించిన వారికి 20 లక్షల పరిహారం ఇవ్వాలనీ, మరణాలపై న్యాయమూర్తి చేత న్యాయ విచారణ జరిపించాలనీ, సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇంకా ఈ ధర్నాను ఉద్దేశించి ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు కె.వి.రమణ, పి.డి.ఎస్.యు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.రామ్మోహన్,ఏ ఐ కె ఎమ్ ఎస్ జిల్లా నాయకులు అర్జా ధర్మారావు ,పి వై ఎస్ నాయకులు తగరం బాబురావు, న్యాయవాది యు. ఏసుబాబు, పీవోడబ్ల్యూ నాయకురాలు కె.రామలక్ష్మి తదితరులు మాట్లాడారు. అనంతరం ఆర్డీవో కి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ఐ.ఎఫ్.టి.యు నాయకులు తమ్మా సోమలింగ మల్లికార్జున రావు, వాసుబోయిన శ్రీను, తుటిగుంట రామారావు పిడిఎస్యు నాయకులు బన్నీ,వినోద్ పూనెం రామన్న కబ్బడి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.