కడప జిల్లా పులివెందుల సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో ఎకరం భూమి కోట్ల రూపాయలలో పలుకుతున్నది. ఈ తరుణంలో కబ్జాదారులకు ఎక్కడ భూమి కనిపించినా ఆక్రమించేస్తున్నారు. భూ బకాసురులు భూమిని తమ కబంధహస్తాల్లో కి తీసుకొని ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు.
కోట్ల రూపాయలు గడిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కదిరి పులివెందుల ప్రధాన రహదారి లోని వెంకటాపురం గ్రామ పొలాలకు సంబంధించిన నీటి కుంటలు కూడా వదలకుండా భూ బకాసురులు కబ్జా చేసి ప్లాట్లు వేసి విక్రయిస్తున్న నేపథ్యంలో వెంకటాపురం గ్రామస్తులంతా కలిసి దాదాపు 300 మందికి పైగా పులివెందుల కదిరి ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.
కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భూ బకాసురులు కబంధహస్తాల నుంచి నీటి కుంటలు కాపాడాలంటూ నినాదాలు చేశారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే ఇలా జరిగితే ఎలా అంటూ ఆందోళనకారులు అన్నారు.