తెలుగుదేశం పార్టీ నాయకుడు జెసి దివాకర్ రెడ్డి కి చెందిన త్రిషూల్ సిమెంట్ కంపెనీ లీజులను ప్రభుత్వం నేడు రద్దు చేసింది. అనంతపురం జిల్లా యాడికి లో 649.86 హెక్టార్ల పరిధిలోని సున్నపు రాతి గనులు ఈ కంపెనీకి ఉన్నాయి. యాడికి లోని కొనుప్పలపాడులోని సర్వే నెంబరు 22 బిలో ఇది ఉంటుంది. ఈ లీజుల్ని ప్రభుత్వం రద్దు చేసింది.
సిమెంట్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి మరో ఐదేళ్ల పొడిగింపు ఇస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్ని కూడా ప్రభుత్వం వెనక్కు తీసుకున్నది. ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి ముందడుగూ పడనందునే ఈ రద్దు ఉత్తర్వులు జారీ చేసినట్టు ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొన్నది.
లీజు ప్రాంతం నుంచి 38 వేల 212 మెట్రిక్ టన్నుల సున్నపు రాయి నిక్షేపాన్ని అక్రమంగా తవ్వితీయటం , రవాణా చేయటంపై విచారణ కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.