కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లారీ యజమానులను ఆదాయ వనరులుగా మాత్రమే చూస్తున్నాయని, లారీ యజమానుల సమస్యలపై శ్రద్ధ చూపడం లేదని తెలంగాణ రాష్ట్ర లారీ యజమానుల సంఘం కౌన్సిల్ సభ్యుడు కోతి సంపత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర లారీ యజమానుల సంఘం,రవాణా రంగం జె ఏ సి మూడు రోజుల కార్యాచరణ పిలుపు మేరకు 2019 ఎం.వి.యాక్ట్ ఉపసంహరణ చేయాలని,పెరిగిన డీజిల్ ధరలపై నిరసనగా మంగళవారం హుజూర్ నగర్ లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను లారీ యజమానుల సంఘం ప్రాంగణంలో దగ్ధం చేశారు.
తెలంగాణ లారీ యజమానుల సంఘం,రవాణా రంగం జేఏసీ కార్యాచరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కోతి సంపత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో రైతుల తర్వాత రవాణా రంగమే కీలక పాత్ర పోషిస్తుందని,రవాణా రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయ వనరులుగా చూస్తూ లారీ యజమానుల నడ్డి విరుస్తూ ప్రతిరోజు డీజిల్ ధరలు పెంచడమే కాకుండా 2019 ఎం.వి.యాక్ట్ అమలు చేయడంతో రవాణా రంగం కుదేలవుతుందని, ఈ భారం సామాన్య ప్రజానీకంపై కూడా పడుతుందని,తక్షణమే ప్రభుత్వాలు ఆలోచించి అట్టి చట్టాన్ని వెనక్కి తీసుకుని వివిధ రకాల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం రవాణా రంగం జెఏసీ తో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈనెల 19న,జరిగే బందుకి ప్రతి ఒక్కరు సహకరిస్తూ ఖైరతాబాద్ లో తెలంగాణ రాష్ట్ర రవాణా కార్యాలయం ముట్టడిని విజయవంతం చేయాలని కోరారు.
అనంతరం హుజూర్ నగర్ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ పెంచిన డీజిల్ ధరలు,రవాణా పత్రాలకి సంబంధించిన టాక్స్ లని తగ్గించాలని, 19వ,తారీకు జరిగే ముట్టడి కార్యక్రమానికి భారీ సంఖ్యలో హుజూర్ నగర్ లారీ యజమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతున్నామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గోళ్ళ శంకర్రావు,సెక్రటరీ కె.వి.ప్రతాప్,వైస్ ప్రెసిడెంట్ రామిశెట్టి శ్రీనివాస్, కోశాధికారి శ్రీనివాస రాజు,జాయింట్ సెక్రెటరీ రవి,కార్యవర్గ సభ్యులు కె.సత్యనారాయణ,డీసీఎం సంఘ ప్రతినిధులు బుల్లెట్ శ్రీను,నవీన్,లారీ యజమానులు శేఖర్ రెడ్డి,అలీ,చందు, హరి,రాజు,వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్