మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచ గుర్తింపు పొందిన ప్రఖ్యాత రామప్ప దేవాలయంలోని శ్రీ రామలింగేశ్వర స్వామిని జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శనివారం వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని రామప్ప ఆలయాన్ని కలెక్టర్ కుటుంబ సమేతంగా సందర్శించారు. భక్తులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు.
18 నుండి 20 వరకు జరగనున్న మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు రామప్ప దేవాలయం దర్శించుకోవడానికి భక్తులు సుమారుగా లక్ష వరకు రానున్నారని ఆయన తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా రామప్ప దేవాలయం ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సకల సౌకర్యాలతో రెవిన్యూ దేవదాయ శాఖ పోలీస్ శాఖ సమన్వయంతో సేవలు అందించనున్నరని తెలిపారు.
రామప్ప ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించే శివపార్వతుల కళ్యాణాన్ని భక్తులు తిలకించి రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని పునీతులు కావాలని కలెక్టర్ కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట వెంకటాపూర్ తహసిల్దార్ మంజుల, ఎంపీ ఓ మమత, దేవదాయశాఖ సిబ్బంది సంబంధిత శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.