కరోనావైరస్ గత ఏడాదిన్నరపైగా మానవాళి మనుగడకు ప్రశ్నార్థకంగా మారింది. వైరస్ నిరోధానికి వ్యాక్సిన్లు కనిపెట్టినా.. పెద్దగా ఉపయోగం లేదు. మ్యుటేట్ అవుతూ కొత్త వేరియంట్లుగా విజృంభిస్తోంది. వ్యాక్సీన్ వేసుకున్నా కరోనా రావడంతో మూడో డోస్ దిశగా ప్రపంచదేశాలు అడుగులు వేస్తున్నాయి.
ఫలితంగా బూస్టర్ డోస్పై చర్చలు మొదలయ్యాయి. రెండో డోసు తర్వాత 8 నుంచి 10 నెలల పాటే శరీరంలో యాంటీబాడీస్ వుంటాయన్న కథనాలు చాలా మందిలో బూస్టర్ డోసు అవసరమన్న అభిప్రాయాన్ని పెంచాయి. మరోవైపు కరోనాతో సహజీవనం అనివార్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. వైరస్ పాండెమిక్ స్థితి నుంచి ఎండెమిక్ స్థాయికి దిగివస్తుందా అన్నదానిపై క్రమంగా క్లారిటీ వస్తోంది.
తాజాగా బూస్టర్ డోసులపై దేశాలు మారటోరియం విధించాలని డబ్ల్యూహెచ్ఓ సూచన చేస్తోంది. వ్యాక్సిన్లను బూస్టర్ డోసుల కోసం వాడితే, తొలి డోస్ దక్కని వారికి ఇబ్బందని చెబుతోంది. అందుకే బూస్టర్ డోసు వినియోగంపై 2021 చివరి వరకు మారటోరియం విధించాలని స్పష్టం చేస్తోంది.