సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని లింగగిరి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయ భూములను సేద్యం చేసుకుంటున్న రైతులు సకాలంలో కౌలు చెల్లించి దేవాలయ అభివృద్ధికి సహకరించాలని దేవాలయ కార్యనిర్వహణాధికారి గుజ్జుల కొండారెడ్డి రైతులను కోరారు.
బుధవారం మట్టపల్లి దేవస్థాన ఈ ఓ ఉదయ భాస్కర్ పర్యవేక్షణలో జరిగిన లింగగిరి దేవాలయానికి చెందిన వ్యవసాయ భూముల కౌలు బహిరంగ వేలంలో పాల్గొని ఈ విషయాన్ని తెలియజేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులను అనుసరించి ఈ వేలం నిర్వహించినట్లు కొండా రెడ్డి తెలిపారు.
శ్రీనివాసపురం గ్రామంలో ఉన్న సర్వే నెంబర్ 527 లో గల 24 ఎకరాలకు ఈరోజు బహిరంగ వేలం ద్వారా 7,69,000 రూపాయలు దేవాలయానికి ఆదాయం సమకూరిందని, ఈ వేలం ద్వారా వచ్చినది గత సంవత్సరం కంటే 2,69,000 రూపాయలు అధికమని అన్నారు.
దేవాలయానికి చెందిన మరొక సర్వే నెంబర్లో 4-38 ఎకరాలకు జరిగిన వేలం పాటలో సరైన పాట రానందున మరొకసారి వేలం నిర్వహించేందుకు వాయిదా వేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి కొప్పుల సైదిరెడ్డి, ఎంపీటీసీ విజయలక్ష్మి, దేవాలయ అర్చకుడు దామోదరా ఆచార్యులు, దేవాదాయ శాఖ సిబ్బంది, చలపతి, శంబభిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, శ్రీనివాస్, ఇరుగ్రామల సర్పంచులు ప్రత్తిపాటి రమ్య నాగరాజు,కర్నాటి అంజి రెడ్డి, చుట్టుప్రక్కల గ్రామాల రైతులు పాల్గొన్నారు.