సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం ప్రపంచ కార్మిక దినోత్సవ మేడే సంబరాలను సి ఐ టి యు నేతృత్వంలో అత్యంత ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఎర్ర జెండాలను చేతబూని అంగరంగ వైభవంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సి ఐ టి యు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి, జిల్లా కార్యవర్గ సభ్యుడు యలక సోమయ్య గౌడ్ పారిశ్రామిక వాడలలో జెండా ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి, రోషపతి,సోమయ్య గౌడ్ మాట్లాడుతూ బానిసత్వం, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా శ్రమ దోపిడీని ఎదురుచూస్తూ సకల కార్మికలోకం కీలకమైన హక్కులను సాధించుకున్న రోజు మేడే అని అన్నారు. శ్రమకు సరైన గుర్తింపు,సరైన వేతనం రోజుకు ఎనిమిది గంటల పని హక్కును కార్మికులు పోరాడి సాధించుకున్న రోజు మేడే అన్నారు.1886లో అమెరికాలోని షికాగో లోని హే మార్కెట్లో జరిగిన కార్మికుల ప్రదర్శనే ఈ మేడే పుట్టుకకు పునాది వేసిందని గుర్తు చేశారు. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప అని ఎలుగెత్తి చాటిన కార్ల్ మార్క్స్ పోరు నినాదం ప్రపంచ కార్మికులను ఆకర్షించిందని అన్నారు. ఈ పోరాటం తర్వాత ప్రపంచ కార్మికులు ఎనిమిది గంటల హక్కును సాధించుకున్నారు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సి ఐ టి యు, అనుబంధ సంఘాల కార్మిక నేతలు, కార్మికులు,ఉద్యోగులు,ప్రజలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్