కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు వీడ్కోలు చెప్పేందుకు రేణిగుంట విమానాశ్రయం వెళ్లిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డినిను భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించలేదు.
వీఐపీ గేటు వద్ద ఆయన్ని అడ్డుకుని వెనక్కి నెట్టటంతో మంత్రి కిందపడబోయారు. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ రెండు రోజుల పర్యటన నిమిత్తం చిత్తూరు జిల్లాకు వచ్చారు.
ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వాగతం పలకడానికి రాష్ట్ర మంత్రి వెళ్లారు.
తిరుగు ప్రయాణంలో భాగంగా విమానాశ్రయంలో వీడ్కోలు చెప్పడానికి మంత్రి బుగ్గన వీఐపీ గేటు వద్దకు వెళ్లగా భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించలేదు.
మంత్రి ప్రవేశించే ప్రయత్నం చేయగా బలంగా వెనక్కి నెట్టడంతో కిందపడిపోయే పరిస్థితి తలెత్తింది. దీంతో కేంద్ర మంత్రికి వీడ్కోలు పలకలేని పరిస్థితి నెలకొంది.
తనను అడ్డుకున్న భద్రతా సిబ్బంది వివరాలు ఇవ్వాలని విమానాశ్రయ అధికారులను రాష్ట్ర మంత్రి కోరారు.
ఈ సందర్భంగా రాజేంద్రనాథ్రెడ్డికి విమానాశ్రయ అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ పరిణామంతో విమానాశ్రయంలో కొంత సమయం గందరగోళం నెలకొంది.