పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ లో ఇడి అరెస్టు చేసిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి పార్థ ఛటర్జీ ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంత్రి వర్గం నుంచి తప్పించారు. అరెస్టు అయిన ఆరు రోజుల తర్వాత మమతా బెనర్జీ అతనిపై చర్య తీసుకున్నారు.
తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ మంత్రి పార్థ్ రాజీనామాకు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి నేతలు స్వరం పెంచడం ప్రారంభించారు. దాంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ భేటీలో పార్థ ఛటర్జీకి మంత్రి పదవి నుంచి ఉద్వాసన పలకాలని నిర్ణయం తీసుకున్నారు. పార్థ ఛటర్జీకి వ్యతిరేకంగా పార్టీ సీనియర్ నేతలు రోజు రోజుకు స్వరం పెంచుతుండటంతో సీఎం మమతా బెనర్జీ కి చర్యలు తీసుకోక తప్పలేదు. తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ కూడా ఆయనను మంత్రి వర్గం నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు.
పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్కు సంబంధించి సినీ నటి అర్పితా ముఖర్జీకి చెందిన నాలుగు ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసింది. గదులే కాకుండా వాష్ రూమ్ లోనూ నగదు దాచి ఉంచారు. ఇప్పటివరకు 53 కోట్లకు పైగా నగదు, బంగారం, డాలర్లు తదితరాలు దొరికాయి. అర్పితా ముఖర్జీ మంత్రి కి అత్యంత సన్నిహితురాలు.