రాష్ట్రంలో కొనసాగుతున్న రివర్స్ టెండర్ రింగ్, రివర్స్ పాలన మాదిరిగానే తమ పార్టీ విధానం కొనసాగుతుందని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె. రఘురామకృష్ణం రాజు అన్నారు. పార్లమెంటు ఉభయ సభలలో రాష్ట్రపతికి పెద్ద ఆసనం వేసి, ప్రధాని ఎంత గొప్పవాడైన అతని ఆసనం కంటే చిన్నది వేస్తారన్నారు.
కానీ తమ పార్టీలో గౌరవాధ్యక్షురాలుకి చిన్న కుర్చీ వేసి, అధ్యక్షుడికి మాత్రం పెద్ద కుర్చీ వేశారన్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు, తన తల్లి విజయమ్మని పెద్ద కుర్చీలో కూర్చోబెడితే, జగన్మోహన్ రెడ్డి విలువే పెరిగి ఉండేది అన్నారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలిని గౌరవించే విధానం ఇదేనా అని ప్రశ్నించారు. వైయస్ సతీమణిగా, పార్టీ గౌరవాధ్యక్షురాలుగా విజయమ్మంటే తమకు ఎంతో గౌరవం ఉన్నదన్నారు. వీడ్కోలు సభలోనైనా కని, పెంచిన కన్న తల్లి కాబట్టి… తన కష్టంతో, ఇంకా తన కుమార్తె కష్టంతో… జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు… నడిరోడ్డుపై నిలబడి దేహి అని తిరుగుతూ, సోనియా గాంధీ కాళ్ల, వేళ్ల పడి బెయిల్ ఇప్పించి, పార్టీని బతికించిన ఆమెకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు..
పార్టీ గౌరవాధ్యక్షురాలు పదవికి రాజీనామా చేస్తూ మాట్లాడిన విజయమ్మ, తమ బాబు చెప్పినవన్నీ చేశాడని, అందరూ ఆయన్నీ చూసి కుళ్లుకుంటున్నారని … పచ్చ మీడియా అంటూ విమర్శలు గుప్పించడం పట్ల రఘురామ విస్మయం వ్యక్తం చేశారు.. విజయమ్మను వీలైతే స్వయంగా కలిసి, లేదంటే లేఖ రాసి సాక్షి దినపత్రిక కథనాలు నమ్మవద్దని, హైదరాబాదుకు వెళ్ళగానే సాక్షి దినపత్రికను చదవడం మానివేయాలని కోరుతానని చెప్పారు. మీ సన్నీ చెప్పినవి ఏమీ చేయలేదమ్మా… గతంలో లబ్ధిదారులకు వెళ్లే మొత్తాన్ని, ఇతర ప్రయోజనాల కోసమని నేరుగా ఖాతాలలో జమ చేస్తున్నారని చెప్పారు.
ఇక కొత్తగా ప్రవేశపెట్టినది ఒకే ఒక స్కీమ్ అని, దానిలోను ఎన్ని విధాలుగా కోతలు విధించాలో, అన్ని విధాలుగా కోతలను విధిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో 30 లక్షల ఇల్లు అన్నారని, కనీసం మూడు ఇళ్ళను కూడా కట్టలేదని రఘురామ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో కట్టిన భవనాలకు వైఎస్ఆర్ పార్టీ రంగులను వేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ప్లీనరీ లోతమ జిల్లాకు చెందిన వారితో బలవంతపు భోజనాలను ఏర్పాటు చేయించినట్లు తెలిసిందన్న ఆయన, ఎమ్మెల్యేలకు ప్లీనరీ ట్యాక్స్ కూడా విధించినట్లు తనకు సమాచారముందని చెప్పారు. ఇక 40 రకాల వంటకాలు అంటూ సాక్షి టీవీలో చూపిస్తూ, పార్టీలకతీతంగా వచ్చి భోజనాలు చేసి వెళ్ళాలన్నట్లు గా రెచ్చగొడుతున్నారన్నారు. రేపు మరో నలభై రకాల వంటకాలు చేసుకోండని ఎద్దేవా చేశారు.