ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి అదనపు తలనొప్పులు తెచ్చిపెడుతున్న దేవాదాయ ధర్మాదాయ శాఖలో భారీ మార్పులు జరగబోతున్నాయా?
ఈ ప్రశ్నకు సమాధానం అవుననే వినిపిస్తున్నది. ముందుగా ఆ శాఖను సరిగా నిర్వహించలేక రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెడుతున్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును తప్పించబోతున్నారని విశ్వసనీయంగా తెలిసింది.
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు శాఖ మారుస్తారా లేక మొత్తానికి మంత్రి వర్గం నుంచే ఉద్వాసన పలుకుతారా అనే విషయం స్పష్టం కాలేదు కానీ మొత్తానికి ఆయనకు మాత్రం పదవీ గండం ఉన్నట్లు తెలిసింది.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను మరీ ముఖ్యంగా ఇదే విధమైన దాడులు జరుగుతూ ఉంటే హిందువులలోని మెజారిటీ కులాలకు దూరం అయిపోవడం ఖాయమని ముఖ్యమంత్రి జగన్ కు ఆయన నమ్ముకున్న ఆధ్యాత్మిక గురువులు కూడా వెల్లడించారని తెలిసింది.
దాంతో మంత్రికి ఆ శాఖ నుంచి ఉద్వాసన పలకాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దేవాదాయ శాఖ కు శాంతి భద్రతల అంశానికి సంబంధం లేకపోయినా కనీసం నష్ట నివారణ చర్యలు తీసుకోవడంలో కూడా మంత్రి శ్రీనివాసరావు విఫలమయ్యారని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.
విజయనగరం జిల్లా రామతీర్ధం లో రాముల వారి విగ్రహానికి తల నరికిన సంఘటనలో ముందు మంత్రి అక్కడకు వెళ్లిఉంటే పరిస్థితి అదుపులోకి వచ్చేది కానీ వెల్లంపల్లి శ్రీనివాసరావు అక్కడకు వెళ్లలేదు. దాంతో విజయసాయి రెడ్డి హుటాహుటిన అక్కడకు వెళ్లాల్సి వచ్చింది.
మంత్రి పదవిలో ఉండి ఇంత క్రియారహితంగా ఉండటం వల్ల సమస్య పెద్దది అయి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్నదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రిని ఆ శాఖ నుంచి తప్పిస్తే గానీ కొంతైన వివాదం సర్దుమణగదని ముఖ్యమంత్రి జగన్ కు స్వాములు కూడా సలహా ఇచ్చారని అంటున్నారు.
ఇదే నిజమైతే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు త్వరలో ఉద్వాసన తప్పదని అంటున్నారు.