బీబీనగర్ మండలం మగ్దూంపల్లి గొల్లగూడెంకు చెందిన క్యాసాని లింగస్వామి, సంధ్య దంపతుల కుమారుడు క్యాసాని సాక్షిత్(4) గత వారం రోజుల నుంచి అపస్మారక స్థితి లోనే ఉన్నాడు.
ముక్కు లో చిన్న కురుపు ఆపరేషన్ చేసే నిమిత్తం సాక్షిత్ ను ఈ నెల 20వ తేదీన ఏఎస్ రావు నగర్ లోని అంకుర్ ఆస్పత్రిలో చేర్చారు.
ఆపరేషన్ చేసే సమయంలో వైద్యులు ఇచ్చిన అనస్థీషియా మోతాదు మించడంతోనే అపస్మారక స్థితిలోకి వెళ్లాడని బాధితులు ఆరోపిస్తూ ఏఎస్ రావునగర్ లోని ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగడంతో బాలుడిని యధాతథంగా అప్పగిస్తామని ఆసుపత్రి యాజమాన్యం హామీ ఇచ్చి ఈనెల 21న రాత్రి యశోద ఆసుపత్రికి తరలించారు.
గత నాలుగు రోజులుగా చికిత్స చేస్తున్న సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు చివరికి గురువారం చేతులు ఎత్తిసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. బాలుడికి మత్తుమందు అధికం కావడంతోనే బ్రెయిన్ డెడ్ జరిగినట్లు వైద్యులు తెలిపినట్లు బాధితులు చెబుతున్నారు.
చిన్న కురుపు వైద్యం చేయమని తీసుకువస్తే బాలుడి నిండు ప్రాణానికే ప్రమాదానికి కారణమైన అంకుర్ ఆస్పత్రి యాజమాన్యం న్యాయం చేయాలని కోరుతూ బాధితులు ఆందోళనకు దిగారు.