ఆంధ్ర -కర్ణాటక సరిహద్దులోని మదనపల్లె చీ కల బైలు చెక్ పోస్ట్ వద్ద పోలీసులపై రుసరుసలాడిన కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే బొర్రా మధుసూదన్ యాదవ్ చివరకు తగ్గాల్సి వచ్చింది.
లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ బెంగుళూరు నుంచి కనిగిరి కి 5 ఇన్నోవాలలో సుమారు 39 మందిని తీసుకుని ఎమ్మెల్యే మధుసూధన్ తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. కర్ణాటక నుంచి వచ్చే వారిని అనుమతించేదిలేదని పోలీసులు తేల్చి చెప్పారు.
అయితే ఆయన వినకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అధికార పార్టీ ఎమ్మెల్యేను నన్నే అడ్డుకుంటరా మీ అంతు చూస్తా అంటూ ఆయన పోలీసులపై విరుచుకుపడ్డారు. అయినా పోలీసులు వదల్లేదు. దాంతో మీ పై అధికారులతో మాట్లాడి వస్తా నని తన వాహనాన్ని మదనపల్లె వైపు తీసుకువెళ్లారు. మదనపల్లె రూరల్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఎమ్మెల్యేతో డి.ఎస్.పి రవి మనోహర ఆచారి భేటీ అయ్యారు. ప్రభుత్వ ఆదేశాలను డిఎస్పీ ఎమ్మెల్యేకు వివరించారు. వారిని ఎట్టిపరిస్థితుల్లో అనుమతించేది లేదని డిఎస్పీ చెప్పడంతో చివరకు ఎమ్మెల్యే వారిని కర్ణాటకకు తిప్పి పంపారు. ఎమ్మెల్యే వాహనాన్ని మాత్రమే అనుమతించడంతో కనిగిరి కి బొర్రా మధుసూదన్ యాదవ్ వెళ్లిపోయారు.